Student Murder: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మెల్ బోర్స్ సిటీలో భారత్ కు చెందిన నవజీత్ సంధును తోటి విద్యార్థులే కత్తితో పొడిచి చంపారు. భారత్ కు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
మెల్ బోర్న్లో విద్యార్థుల మధ్య ఘర్షణ వల్ల నవజీత్ ప్రాణాలు కోల్పోయాడని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన నవజీత్ 2022 నవంబర్ నెలలో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు.
అయితే శనివారం రాత్రి అద్దె కోసం ఇద్దరు భారత విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతుండగా వారిని ఆపేందుకు నవజీత్ వెళ్లాడు. ఘర్షణ జరుగుతున్న సమయంలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లింది. దీంతో అక్కడే నవజీత్ మృతి చెందినట్లు అతడి మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడని నవజీత్ తండ్రి జితేందర్ సింధు తెలిపారు. తన కొడుకును తోటి విద్యార్థులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
శ్రావణ్ కుమార్ అనే విద్యార్థి తన రూమ్ మేట్స్ తో గొడవపడి నవజీత్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. కాసేపటికే అక్కడకు వచ్చిన శ్రావణ్ రూమ్ మేట్స్ అతడిని బయటకు రావాలని ఫోన్ చేసి పిలిచారు. తనతో పాటు నవజీత్ ను బయటకు రమ్మని శ్రావణ్ కోరగా అతడితో పాటు నవజీత్ వెళ్లాడని అతడి తండ్రి తెలిపారు. ఆ సమయంలోనే శ్రావణ్ పై కత్తితో దాడి చేస్తున్న వారిని అడ్డుకోబోతుంటే నవజీత్ ని పొడిచి చంపారని అన్నారు.
Also Read: ఇసుక మాఫియాని అడ్డకున్న పోలీస్ అధికారి హత్య!
హత్యకు సంబంధించిన సమాచారం తమకు ఆదివారం ఉదయం అందిందని తెలిపారు. జూలైలో నవజీత్ ఇండియా రావాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు. నవజీత్ ను హత్య చేసిన నిందితులు పారి పోగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.