Indore Infosys Techie Killed: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో జరిగిన ఒక ఘోర దుర్ఘటనలో 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. నివాస సముదాయం పార్కింగ్ ఏరియాలో అద్దె వివాదం కారణంగా ఒక వ్యక్తి తన కారుతో ఉద్దేశపూర్వకంగా తొక్కించడంతో ఈ ఘోరం జరిగింది. ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న శంపా పాఠక్ పాండే ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోరానికి మూలం ఒక పెెంట్హౌస్ను ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ‘Airbnb’ ద్వారా అద్దెకు ఇవ్వడం. నిందితుడు మోహిత్ చౌదరి తండ్రి కుల్దీప్ చౌదరి తన పెెంట్హౌస్ను తరచుగా పర్యాటకులకు అద్దెకు ఇచ్చేవారు. అయితే, అర్థరాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు రావడం, వారి వల్ల కలిగే ఆటంకాలపై అపార్ట్మెంట్ నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నివాసితులు సదరు పెెంట్హౌస్కు విద్యుత్ సరఫరా కట్ చేశారు. దీనికి ప్రతిగా కుల్దీప్ చౌదరి ఇతర ఫ్లాట్లకు పవర్ కట్ చేశారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.
వివాదం ముదరడంతో కుల్దీప్ తన కుమారుడు మోహిత్ చౌదరిని అక్కడికి పిలిపించారు. మోహిత్ తన కారుతో అతివేగంగా వచ్చి పార్కింగ్ ఏరియాలో ఉన్న ప్రజలపైకి దూసుకెళ్లాడు. తొలుత ఒక పనిమనిషిని ఢీకొట్టాడు నిందితుడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ శంపా పాండేపైకి కారును పోనిచ్చాడు. నిందితుడు తనను కూడా చంపడానికి ప్రయత్నించాడని, తను తృటిలో తప్పించుకున్నానని శంపా భర్త సౌరభ్ పాండే పేర్కొన్నారు. కారు వేగానికి అది చివరకు గోడను ఢీకొట్టి ఆగిపోయిందని తెలిపారు.
ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడు మోహిత్ చౌదరితో పాటు అతని తండ్రి కుల్దీప్ చౌదరిని కూడా అరెస్ట్ చేశారు. నివాసితుల ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పెెంట్హౌస్ వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయని గతంలో బిల్డర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా ఉండాల్సిన నివాస ప్రాంతాల్లో ఇటువంటి క్షణికావేషాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం ఇండోర్ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also: West Godavari Crime: ఇన్స్టా లవ్.. ప్రియుడి కోసం పారిపోయిన వివాహిత, వారిద్దరి జీవితాలు చివరకు