Kadapa: కడప జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక షార్ట్ ఫిలిమ్ తీయడం కలిసిన కొందరు యువకుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది యువకులు ‘ఫ్రంట్లైన్ ప్రెస్’ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు.
ఈ క్రమంలోనే వారు తమ తదుపరి షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం వల్లూరు మండలం, పుష్పగిరి గ్రామ సమీపంలోని పెన్నా నది వద్దకు చేరుకున్నారు. షార్ట్ ఫిలిం తీసే పనిలో నిమగ్నమై ఉండగా ఊహించని విధంగా ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో లోతు తెలియకపోవడం వల్ల హరిబాబు(25), హర్షవర్ధన్(22), కృష్ణచైతన్య (20) అనే ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వెంట ఉన్న మిగిలిన స్నేహితులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. హరిబాబు, హర్షవర్దన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే కృష్టచైతన్య మృతదేహం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కళ్లముందే స్నేహితులు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన యువకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధి వెతుక్కుంటూ తమ కలలను సాకారం చేసుకోవాలనుకున్న ఈ యువకుల మృతి ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఫ్రెండ్ అని నమ్మితే.. రూ.2.36 కోట్లు హాంఫట్.. కొండాపూర్ టెక్కీకి భారీ టోకరా!