Student Suicide: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల ఆరోపణల వల్ల విద్యార్ధిని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తుంది.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న శ్రీవిద్య అనే విద్యార్థిని, యూనివర్సిటీ హాస్టల్లోనే ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. అయితే.. ఇటీవల ఆమె గదిలో ఉంటున్న తోటి విద్యార్థినుల ల్యాప్టాప్లు, కొన్ని బంగారు నగలు మాయమయ్యాయి. ఈ క్రమంలో.. ఆ వస్తువులను శ్రీవిద్యే దొంగిలించి ఉంటుందని తోటి విద్యార్థినులు ఆమెపై బలంగా అనుమానం వ్యక్తం చేశారు.
దొంగతనం ఆరోపణలు ఎదుర్కోవడంతో శ్రీవిద్య తీవ్ర మనస్థాపానికి గురైంది. తనపై వచ్చిన నిందను భరించలేక ఆమె హాస్టల్ నుంచి తన స్వగ్రామానికి వెళ్లిపోయింది.అయినప్పటీ ఆ అవమానం నుంచి కోలుకోలేక ఈ నెల 7వ తేదీన ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమె పరిస్థితిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
శ్రీవిద్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాణాలతో పోరాడిన ఆమె దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఒక చిన్న ఆరోపణ, సరైన విచారణ లేకుండా చేసిన నిందలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు దొంగతనం జరిగిందా? శ్రీవిద్యపై ఆరోపణలు చేయడానికి గల కారణాలేంటి? హాస్టల్లో విద్యార్థుల మధ్య ఏం జరిగింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులెవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవిద్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
క్యాంపస్లో ఉద్రిక్తత
శ్రీవిద్య ఆత్మహత్య ఘటనతో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ర్యాగింగ్ వల్లే శ్రీవిద్య ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు వీసీ కార్యాలయం ముందు భారీ నిరసన చేపట్టాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీసీ చాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న శ్రీవిద్య రూమ్ మేట్ ల్యాప్టాప్ చోరీకి గురైంది. విచారణలో శ్రీవిద్యే ఆ ల్యాప్టాప్ను డస్ట్ బిన్లో వేసినట్లు తేలింది. ల్యాప్టాప్ పాడవడంతో ఆమె తల్లి ఆ నష్టాన్ని చెల్లించారు. అనంతరం మానసిక స్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ఆమెను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లగా.. అక్కడ శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై వాస్తవాలను వెలికితీసేందుకు రిజిస్ట్రార్ ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. శ్రీవిద్యపై దాడి చేసిన వారిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు కోరుతుండగా, కమిటీ నివేదిక , పోలీసుల విచారణ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ యంత్రాంగం స్పష్టం చేసింది.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
పీజీ విద్యార్థిని శ్రీ విద్య ఆత్మహత్యపై నిరసన
వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులతో విద్యార్థి సంఘాల వాగ్వాదం
Students' Protest at Kakatiya University, warangal.
Protest over PG student Sri Vidya's… pic.twitter.com/TfR7d3JrHV— BIG TV Breaking News (@bigtvtelugu) March 17, 2026
Also Read: నాకే ఆఫర్ ఇస్తావా.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి బ్లాస్ట్