YS Jagan Mohan Reddy: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కేడర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఒంగోలు ఇంఛార్జి చుండూరు రవి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్లమెంటు ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన జగన్.. గుండె ధైర్యం అనేది వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్ అని పేర్కొంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
వైఎస్సార్సీపీ కేవలం తన ఒక్కడిది మాత్రమే కాదని.. అందరూ కలిసి కట్టుగా నిర్మించుకున్న బలమైన వ్యవస్థ అని జగన్ స్పష్టం చేశారు. విలువలు, విశ్వసనీయత పునాదుల మీద పుట్టిన పార్టీ తమదని.. గత ఐదేళ్ల కాలంలో తాము చేసిన మంచి పనులే ప్రజల్లోకి తమను తీసుకెళ్తున్నాయని చెప్పారు. తమ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం అవినీతి కోసమే అధికారంలో ఉందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు.
గతంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రాన్ని ఇచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారని.. కానీ వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉంచారని జగన్ గుర్తు చేశారు. ఆ తర్వాత కోవిడ్ వంటి కష్టాలు ఎదురైనా, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పలేదని వివరించారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ముందస్తు క్యాలెండర్ ఇచ్చి మరీ సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. బడ్జెట్లోనే క్యాలెండర్ను ప్రకటించి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నామని పేర్కొన్నారు.
అప్పుల విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. తమ హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో రూ.2.7 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వేశామని జగన్ వివరించారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే గ్రాస్ అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటాయని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా తేలిపోయాయని.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Read Also: AC Gas Tips: ఏసీ అడ్డదిడ్డంగా పనిచేస్తోందా? గ్యాస్ సమస్య ఉన్నట్లే.. ఇలా చేస్తే అంతా సెట్!