Jeevan Reddy: జగిత్యాల రాజకీయాల్లో సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన ప్రస్తుత పరిస్థితులపై తన ఆవేదనను, అసహనాన్ని అత్యంత స్పష్టంగా వెలిబుచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ అస్థిరతను జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పీకర్కు చెబుతూనే.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. ‘ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి, నాతో కలిసి పనిచేస్తానని అనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు’. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం వేరు, కానీ పార్టీ కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టడం వేరని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీతో తనకున్న 40 ఏళ్ల అనుబంధాన్నిగుర్తు చేసుకుంటూ జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 1995లో చంద్రబాబు హయాంలో పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పుడు కూడా జగిత్యాల మున్సిపాలిటీని గెలిపించిన చరిత్ర తనదని గుర్తుచేశారు. సంజయ్ కుమార్ పార్టీలోకి ‘ఉడుం’ లాగా వచ్చి చేరారని, అలాంటి వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేయడం సాధ్యం కాదని ఘాటుగా విమర్శించారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానన్న బాధే తనను పార్టీ వీడాలనే కఠిన నిర్ణయం వైపు పురికొల్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ నీతులు చెప్పే వ్యక్తుల వల్ల జగిత్యాల కాంగ్రెస్ ఐక్యత దెబ్బతింటోంది. నేను తీసుకునే నిర్ణయం పూర్తిగా రాజకీయబద్ధంగా, కార్యకర్తల శ్రేయస్సు కోసమే ఉంటుంది’. చివరిగా.. తాను ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నానని, ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూనే.. పరిస్థితులు చక్కబడకుంటే కఠిన నిర్ణయం తప్పదని సంకేతాలిచ్చారు. జగిత్యాల కాంగ్రెస్ ఐక్యతను కాపాడుకోవడమే తన ప్రాధాన్యతని ఆయన పునరుద్ఘాటించారు.
తాను ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నానని, శ్రీరామచంద్రుని భక్తుడిగా కేవలం శుభాకాంక్షల ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశానని స్పష్టం చేస్తూనే.. పార్టీ మార్పు ఆలోచనకు ప్రధాన కారణం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా, పార్టీలోకి ఇతర పార్టీల నుండి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెళ్లగొడితేనే తన సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయన తేల్చి చెప్పారు.
అటువంటి ఫిరాయింపుదారులు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆరు గ్యారంటీలలో రైతుభరోసా, తులం బంగారం వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని.. అధిష్టానం వైఖరి కూడా తన అసహనానికి కారణమని ఆయన భావిస్తున్నారు. గౌరవం లేని చోట అభిమానాన్ని చంపుకుని కొనసాగడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన రాజకీయ భవిష్యత్తుపై ఉగాది తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Also Read: అస్సాం పీఠంపై ‘హ్యాట్రిక్’ గురి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదే!