Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలో వలపు వల వేసి అమాయకులను దోచుకుంటున్న కిలాడీ దంపతుల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు రట్టు చేశారు. జిల్లాలోని ఆరేపల్లి సమీపంలో గల శ్రీసాయి నివాస అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఈ భార్యాభర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని భారీ వసూళ్లకు పాల్పడ్డారు.
ఇన్స్టాగ్రామ్లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ, శారీరక సుఖం కావాలంటే సంప్రదించాలంటూ నంబర్లు ఇచ్చి బడా వ్యాపారవేత్తలను, యువకులను ఆకర్షించేవారు. వారు తమ అపార్ట్మెంట్కు రాగానే, సదరు మహిళతో శారీరకంగా కలిసే సమయంలో భర్త చాటుగా నగ్న వీడియోలు, ఫోటోలు తీసేవాడు. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు దండుకునేవారు.
ఈ దారుణమైన వసూళ్లతో వారు అపార్ట్మెంట్ కొనుగోలు చేయడమే కాకుండా, విలాసవంతమైన కారు ఈఎంఐలు కూడా కడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి మాయలో పడి ఇప్పటివరకు దాదాపు వందమందికి పైగా మోసపోయినట్లు సమాచారం.
ఇటీవల కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి ఈ దంపతుల వలలో చిక్కి ఏకంగా 14 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బాధితుడి వద్ద డబ్బులు అయిపోవడంతో అతను రావడం మానేయగా, నిందితులు మళ్ళీ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. పాత వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని, చంపేస్తామని బెదిరించడంతో భయపడిపోయిన బాధితుడు మరో లక్ష రూపాయలు ఇచ్చాడు. అయినప్పటికీ నిందితులు ఇంకా 4 లక్షలు కావాలని ఒత్తిడి చేయడంతో, చేసేదేమీ లేక బాధితుడు తన స్నేహితుల సలహాతో పోలీసులను ఆశ్రయించాడు.
రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ఆ కిలాడీ దంపతులను జైలుకు తరలించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రలోభాలకు గురికావొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Read Also: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి