Karimnagar: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న తన నివాసంలో గన్నేరు పప్పును దంచుకుని సేవించిన ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గన్నేరు పప్పును మెత్తగా దంచుకుని తాగారు. కొంత సమయానికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే స్పందించి ఆమెను కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె మృతి చెందారు.
మృతురాలు దివ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోషంగా ఉండాల్సిన పోలీస్ అధికారి కుటుంబంలో ఈ ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ఆమె అంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విధి నిర్వహణలో నిమగ్నమై ఉండే ఎస్సై భార్య ఇలా ఆత్మహత్య చేసుకోవడం పట్ల తోటి పోలీస్ అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.