Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నంబర్ 2లోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వీరిలో ముగ్గరు పిల్లలు, ఆరుగురు పెద్దవాళ్ళు ఉన్నట్టు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయారు.
ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తే.. భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక కాస్మెటిక్స్ షాపులో మొదట మంటలు చెలరేగాయి. దుకాణంలోని రసాయనాలు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు వంటి ఇతర సులభంగా మంటలు అంటుకునే వస్తువుల వల్ల నిమిషాల వ్యవధిలోనే మంటలు పై అంతస్తులకు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ భవనం మొత్తాన్ని కమ్మేయడంతో నివాసితులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 30 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుకైన సందులు కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవనం లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. క్షణాల్లో ముగిసిన రెండు ప్రాణాలు!