కన్నవారి ప్రేమానురాగాల మధ్య పెరగాల్సిన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని పరువు అనే రాక్షసత్వానికి బలైపోయింది. తాము పెంచిన కూతురే కదా అన్న జాలి లేకుండా, ప్రేమ పేరుతో కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతోందని భావించిన తల్లిదండ్రులు ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 14న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరామ్ పల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం..
పోలీసుల కథనం ప్రకారం.. శివరామ్ పల్లి గ్రామానికి చెందిన బాధితురాలు ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పలుమార్లు కూతురిని మందలించారు. వివాహితుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల కుటుంబ గౌరవం పోతుందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ బాధితురాలి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
గత నెల 14వ తేదీన ఇంట్లో గొడవ జరగడంతో.. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆపై ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశారు. అనంతరం ఏమీ తెలియనట్టుగా.. తన కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో వీడిన మిస్టరీ..
పోస్టుమార్టం నివేదికలో బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. తల్లిదండ్రులను లోతుగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. తామే స్వయంగా కూతురిని హత్య చేసినట్లు వారు అంగీకరించారు. దీంతో నిందితులపై హత్య కేసు నమోదు చేసిన సైదాపూర్ పోలీసులు, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఒక కుటుంబాన్ని జైలు పాలు చేసింది.
ALSO READ: Telegram Durov: నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు నేనే భరిస్తా, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్