Honour Killing: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ ససేమిరా అన్నారు. కులాంతర వివాహం చేసుకోవడానికి వీల్లేదన్నారు. మనస్సు ఇచ్చినవాడితో జీవించాలని డిసైడ్ అయ్యింది, ఇంటికి నుంచి ఆ అమ్మాయి వెళ్లిపోయింది. కూతుర్ని వెతికి మరీ పట్టుకుని అత్యంత దారుణంగా చంపేశాడు కసాయి తండ్రి. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
పరువు హత్య.. పెళ్లి తర్వాత పేరెంట్స్కి దూరంగా
కర్ణాటకలోని హుబ్బళ్లి ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు 20 ఏళ్ల గర్భిణీ కూతురిపై ఆమె కుటుంబసభ్యులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. యువతి భర్త, అత్తమామలు అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఆమె మరణించింది.
ఆదివారం సాయంత్రం హుబ్బళ్లి తాలూకాలోని ఇనామ్-వీరాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుబ్బళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మాన్య పాటిల్.. వివేకానంద అనే యువకుడ్ని ప్రేమించింది. చివరకు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. అయితే ఇద్దరు కులాలు వేరుకావడంతో మాన్య తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు.
వెంటాడి మరీ కూతుర్ని హత్య చేసిన తండ్రి
ప్రియుడు లేని లోకంలో తాను ఉండలేనని నిర్ణయించుకుంది యువతి. కుటుంబసభ్యులు వ్యతిరేకించినప్పటికీ మే లో వివేకానందను వివాహం చేసుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని పోలీసులు ఆ జంటను హెచ్చరించారు. ఈ పెళ్లి ససేమిరా ఇష్టంలేని తల్లిదండ్రులు, తనను చంపేస్తారని భయపడింది.
వివాహం తర్వాత సొంత గ్రామానికి దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో హవేరి జిల్లాలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అటు అత్తమామలు ఇంటికి కూడా వెళ్లలేదు. మాన్యపాటిల్ ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. అత్తమామల ఇంటికి ఆదివారం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మాన్యపాటిల్ తండ్రి ప్రకాష్ గౌడ, మరో ఇద్దరు బంధువులతో కూతురు ఉన్న ఇనామ వీరాపూర్ గ్రామానికి చేరుకున్నారు.
ఆదివారం ఉదయం భర్త వివేకానంద, అతడి తండ్రి పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో బతికి బయటపడ్డారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో మాన్య పాటిల్ అత్తింటిలోకి చొరబట్టారు ఆమె తండ్రి, మరో ఇద్దరు.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ముగ్గురు మృతి
ఆరు నెలల గర్భవతి మాన్యపై అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశారు. దీంతో అక్కడి కక్కడే ఆమె ప్రాణాలు వదిలింది. ఘటనా స్థలంలో అత్తమామలు.. కోడల్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వారిపై కూడా మాన్య తండ్రి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనను హుబ్బళ్లి, ధార్వాడ్లోని దళిత సంస్థలు ఖండించాయి. సోమవారం ఇనామ్ వీరాపూర్, హుబ్బళ్లిలో నిరసనలు చేపట్టారు కూడా. రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి.