UP Crime: మెడికల్ షాపు యజమానితో జరిగిన వాగ్వాదం హింసాత్మకంగా మారింది. చివరకు లా విద్యార్థి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆ విద్యార్థి కడుపును పదునైన కత్తితో కోసేశాడు మెడికల్ షాపు ఓనర్. యువకుడి చేతి వేళ్లను నరికేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలోని కాన్పూర్లో వెలుగు చూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్తే..
యూపీలో అత్యంత దారుణమైన ఘటన
యూపీలోని కాన్పూర్ యూనివర్సిటీలో లా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కేశవ్పురానికి చెందిన అభిజీత్ సింగ్ చందేల్. మందుల నిమిత్తం మెడికల్ షాపుకి వెళ్లాడు. మందుల ధరల విషయంలో అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్త తీవ్రరూపం దాల్చింది. మెడికల్ షాపులోని సిబ్బందికి ఓనర్ అమర్సింగ్ చౌహాన్ మద్దతుగా నిలిచాడు. అయినా లా విద్యార్థి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఆ తర్వాత అమర్సింగ్ సోదరుడు విజయ్ సింగ్, స్నేహితులు కలిసి.. లా విద్యార్థిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. తొలుత తలపై బలంగా కొట్టడంతో అభిజీత్ కింద పడిపోయాడు. పదునైన కత్తితో కడుపు చీల్చారు. తీవ్ర గాయాలు పాలైన అభిజీత్ భయంతో తన ఇంటి వైపు పరుగులు పెట్టాడు. దుండగులు దారిలో అతడ్ని అడ్డగించి ఒక చేతికి చెందిన రెండు వేళ్లను గొడ్డలితో నరికేశారు.
లా విద్యార్థి కడుపు చీల్చి.. చేతి వేళ్లను నరికేశారు
రక్తంతో తడిసిన అభిజీత్ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అరుపులు అరవడం మొదలుపెట్టాడు. కేకలు విన్న స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం అభిజీత్ కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి వచ్చారు. కొడుకుని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు రెండు గంటల పాటు ఆపరేషన్ చేశారు.
అయినప్పటికీ అభిజీత్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి తల్లి నీలంసింగ్ నోరు విప్పారు. పోలీసులతో నిందితులకు సంబంధాలు ఉన్నాయని, రాత్రి తన కొడుకుపై దోపిడీ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. దాడి చేసిన వ్యక్తులు దృష్టి మరల్చడానికి పోలీసులు వారికి రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించింది. నిందితుల్లో ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవపై క్రిమినల్ రికార్డు ఉందన్నారు.
ALSO READ: ఏపీలో దారుణం.. మద్యం మత్తులో కూతురిపై తండ్రి అత్యాచారం
కాకాడియో పోలీస్ స్టేషన్లో దోపిడీ, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఆమె పేర్కొన్నారు. బాధితుడి తలపై 14 కుట్లు పడినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంజీత్ కుమార్ తెలిపారు. రెండు వైపులా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అమర్సింగ్ చౌహాన్, విజయ్ సింగ్, నిఖిల్ తివారీ అరెస్టు చేశారు పోలీసులు. నాలుగో నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.