Accident : మన చుట్టూ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందిస్తాం. సంఘటనా స్థలానికి వెళ్లి ఏమైందో గమనిస్తాం. అక్కడ ఎవరైనా సాయం కోసం అర్థిస్తుంటే.. వారికి తోడుగా నిలుస్తాం. బాధితులకు ఏం కాదని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తాం. తోటి మనిషిగా.. ఇది కనీస ధర్మం. కానీ.. కీసరలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యి.. ప్రాణాలతో పోరాడుతున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఫోటోలు, వీడియోలతో కాలక్షేపం చేశారు స్థానిక ప్రజలు. ప్రమాదం జరిగిన విలవిల్లాడుతున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం మరిచిపోయి.. ఫోన్లలోనే మునిగిపోయారు.
కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం సాయంత్రం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ కు చెందిన ఏలేంద్ర అనే వ్యక్తి.. కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో ఉంటుంటాడు. ఇటీవలే ఇతను కీరసలో కొత్త ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. దాని పనుల్ని చూసుకునేందుకు.. రాంపల్లి నుంచి రోజూ వెళ్లి వస్తుంటాడు. రోజూలానే స్కూటీపై వెళ్లి వస్తుండగా… లారీ రూపంలో ప్రమాదం ఎదురైంది. క్షణాల్లో ప్రమాదాన్ని తప్పించుకున్నట్లే తప్పించుకుని.. మళ్లీ దాని బారిన పడ్డాడు.
రింగు రోడ్డు దగ్గర.. అటుగా వెళుతున్న లారీ ఢీ కొట్టింది. దాంతో.. ఏలేంద్ర కింద పడిపోయాడు. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా పెద్దపెట్టున కేకలు పెట్టడంతో ఏమైందో అనే కంగారులో ముందుకు వెళ్లిన లారీ డ్రైవర్ మళ్లీ వెనక్కి రానిచ్చాడు. దాంతో.. ప్రమాదం నుంచి తప్పించుకున్నా అని ఊపిరి పీల్చుకున్న ఏలేంద్ర కాళ్ల పైనుంచి లారీ వెళ్లింది. రెండు కాళ్లపై నుంచి భారీ లారీ వెళ్లడంతో.. కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఏలేంద్ర తనను కాపాడాలని వేడుకున్నాడు. తనను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అక్కడున్న అందరినీ అడిగాడు. అయినా.. ఒక్కరూ కనికరించలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన స్థానికులు సైతం చలనం లేకుండా.. చేతిలోని ఫోన్ కు పని చెప్పారు. అక్కడ జరిగిన విషయాన్ని, బాధితుడి ఆర్తనాదాల్ని ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలం గడిపేసారు. బాధిత వ్యక్తి.. ఎంత మొత్తుకున్నా ఒక్కరూ పట్టించుకోలేదు.
బాధితుల కాళ్ల నుంచి రక్తం రోడ్డుపై పారుతున్న కనికరించలేదు. 108 కి ఫోన్ చేసి చేతులు దులుపుకున్నారు. అంతే కానీ.. అక్కడ నుంచి వెళుతున్న ఏ వాహనంలోనూ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయలేదు. దాంతో.. కొంతసేపటికి ప్రమాద స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్.. బాధితుడు ఏలేంద్రను చౌరస్తాలోని ఓ ఆసుపత్రికి తరలింది.
రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోవడంతో, తీవ్ర రక్తస్రామైన ఏలేంద్ర.. ఆస్పత్రికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దాంతో.. అప్పటి వరకు ప్రాణాలపై ఆశతో ఉన్న వ్యక్తికి సకాలంలో స్పందించి, వైద్యం అందించలేక ప్రాణాలు తీసినట్లైంది. కాగా. వీరేంద్రకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఇప్పుడు తామంతా అనాథలం అంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోద చేసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.