Lover Attacks Girlfriend Parents In Warangal: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై బుధవారం అర్ధరాత్రి 1.35 గంటల సమయంలో విచక్షణా రహితంగా తల్వార్తో దాడి చేశాడు. ఇంటి బయట నిద్రిస్తున్న యువతి కుటుంబంపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ దాడిలో యువతి తల్లిదండ్రులు మృతి చెందగా.. యువతితోపాటు తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని చంద్రరావు మండలం 16 చింతల తండాలో చోటుచేసుకుంది.
నిందితుడు నాగరాజు.. పక్కా ప్రణాళికతో అర్థరాత్రి దీపిక కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. గాఢ నిద్రలో ఉన్న దీపిక కుటుంబ సభ్యులు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నాగరాజు తల్వార్తో పొడిచాడు. దీంతో వారు కేకలు వేశారు. వెంటనే నాగరాజు యువతి తల్లి గొంతుకోశాడు. స్థానికులు వచ్చే వరకు అప్పటికే నాగరాజు అందరిపై దాడిచేస్తున్నట్లు తెలిపారు. స్థానికులను గమనించిన నాగరాజు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
గాయాలతో ఉన్న నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే యువతి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా.. మార్గమధ్యలో తండ్రి మృతిచెందాడు. ప్రస్తుతం యువతి, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బానోతు శ్రీనివాస్(45), బానోతు సుగుణ(40) దంపతులు 16 చింత తండాలో నివాసం ఉంటున్నారు. గూడూరు మండలం గెండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ, ప్రేమించుకున్నారు. వీరిద్దరూ గతేడాది నవంబర్లో ఇంట్లో నుంచి వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో యువతి తల్లిదండ్రులను ఆశ్రయించింది. దీంతో జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు.
Also Read: రోడ్డు యాక్సిడెంట్.. మిస్టర్ తెలంగాణ విన్నర్ మహ్మద్ సోహైల్ మృతి
తాను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని నాగరాజు…యువతి తల్లిదండ్రులపై కక్ష్య పెంచుకున్నాడు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నాగరాజు ఉన్మాదిగా మారాడు. ఈ నేపథ్యంలో ఇంటి ముందు నిద్రిస్తున్న యువతి తల్లిదండ్రులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.