Vizag Love Case: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కోమాలోకి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఆనందపురం మండలం ఎడ్లవారికల్లాలకు చెందిన తాడి సాయి (21) అనే యువకుడు, పాలవలస గ్రామానికి చెందిన ఒక యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి పరిచయం ఇంటర్మీడియట్లో మొదలై, డిగ్రీ మొదటి సంవత్సరం వరకు కొనసాగింది. అయితే, వీరి ప్రేమ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వారు గతంలో సాయిని మందలించారు. దీంతో కొంతకాలం దూరంగా ఉన్న ఈ జంట.. మళ్ళీ రహస్యంగా కలుసుకోవడం ప్రారంభించారు.
గత శనివారం అర్ధరాత్రి, సాయి తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె నివాసం ఉండే ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ రాత్రి ఎమైందో ఎమో.. ఆదివారం ఉదయానికి అతను తీవ్ర గాయాలతో విశాఖలోని KGH ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ప్రత్యక్షమయ్యాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సాయి ప్రస్తుతం కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాడుతున్నాడు.
యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడిపై అమ్మాయి బంధువులు కిరాతకంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని, తల పగిలేలా కొట్టడం వల్లే సాయి కోమాలోకి వెళ్ళాడని ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యా యత్నమే అని ఆనందపురం పోలీసులతో వారు వాదిస్తున్నారు. యువతి బంధువులు సాయి తమ ఇంటికి వచ్చినప్పుడు భయంతో బిల్డింగ్ పైనుంచి దూకేశాడని, ఆ క్రమంలోనే అతనికి గాయాలయ్యాయని పోలీసులకు తెలిపారు. ఘటనపై ఆనందపురం పోలీసులు ప్రాథమికంగా దీనిని ‘స్వీయ ప్రమాదం’ (Accidental fall) కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితుడి బంధువులు ఆనందపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. నిందితులపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.