Minister Seethakka: స్వేచ్ఛ బ్యూరో: అంగన్ వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తామని ఇందుకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. నాంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కోఠి, ఇసామియా బజార్ ప్రాంతంలోని ఎఫ్.జె. లేన్స్లో నూతనంగా నిర్మించిన ప్రీఫాబ్రికేటెడ్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల చిన్నారులకు పాలు అందించే పైలట్ ప్రాజెక్టు ములుగు జిల్లాలో మొదలు పెట్టగా, అది సక్సెస్ అయిందని, త్వరలో ఇతర జిల్లాలకు ఆ ప్రాజెక్టును విస్తరించనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక పాఠశాలల స్థాయిలో ప్రారంభ బాల్య విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నూతనంగా ప్రారంభించిన ఈ కేంద్రంలో డిజిటల్ లెర్నింగ్ సాధనాలు, గేమిఫైడ్ విద్యా పరికరాలు, ఏఐ ఆధారిత రీడింగ్ అసిస్టెంట్, ఇమర్సివ్ లెర్నింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి 3డీ వీఆర్ హెడ్సెట్ ధరించి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని పరిశీలించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు తగిన మౌలిక సదుపాయాలు లేకుండా కొనసాగుతున్నాయని, త్వరలో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రూ.16.44 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో అంగన్వాడీ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిని మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం సంరక్షణ కేంద్రాలు మాత్రమే గాక, చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమైన విద్యా కేంద్రాలని మంత్రి పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాకాహారం, అల్పాహారం అందించటంతో పాటు ఆటల ద్వారా నేర్చుకునే విద్యా సాధనాలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంగన్వాడీ వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ చిన్నారులకు యూనిఫార్మ్లు అందజేస్తున్నామని వివరించారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషకాహారం బలోపేతం చేసేందుకు సుప్రభాత భోజనం అనే అల్పాహార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 1975లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పోషకాహారం, ప్రారంభ సంరక్షణ అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలు, విద్యా సౌకర్యాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి, వారి శ్రేయస్సు పట్ల ఆసక్తిగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. చిన్నారుల ఆనందం , అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) ద్వారా గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Medical Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.1,90,000 వరకు జీతం
హైదరాబాద్ జిల్లాలో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 970 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. నాంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎఫ్.జె. లేన్స్ అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇసామియా బజార్ ప్రాంతంలోని 233 కుటుంబాలకు ఈ కేంద్రం సేవలు అందిస్తోందని, ఈ పరిధిలో 357 మంది పురుషులు, 360 మంది మహిళలు నివసిస్తున్నట్లు, ఇందులో 19 మంది చిన్నారులు, నలుగురు గర్భిణీలున్నట్లు, మరో ముగ్గురు బాలింతలు ఈ కేంద్రం నుంచి సేవలను పొందుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ అంగన్వాడీ కోసం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో సంప్రదాయ భవనాల నిర్మాణంలో అనుమతులు, అమలులో ఆలస్యం జరుగుతుందని, అలాంటి ఆలస్యాలను నివారించేందుకు ప్రీఫాబ్రికేటెడ్ నిర్మాణ విధానాన్ని అనుసరించి తక్కువ సమయంలో అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ అంగన్వాడీ భవనాన్ని ప్రీఫాబ్రికేటెడ్ సాంకేతికతతో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించామని, బలమైన మైల్డ్ స్టీల్ ఫ్రేమ్ నిర్మాణం, ప్రీఫాబ్రికేటెడ్ సిమెంట్ ప్యానెల్ గోడలు, పీయూఎఫ్ రూఫ్ షీట్లు, ఈవీఏ ఫోమ్తో కూడిన ప్రీకాస్ట్ సిమెంట్ టైల్ ఫ్లోరింగ్, రెండు తలుపులు, చిన్నారులకు అనుకూలమైన మరుగుదొడ్డి యూనిట్, హ్యాండ్వాష్ బేసిన్, ట్యాపులు ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్నారుల మెదడు అభివృద్ధి, ప్రారంభ విద్య కోసం అవసరమైన సాఫ్ట్వేర్లు, విద్యా సాధనాలు కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. అలాగే విద్యా బొమ్మలు, గేమిఫైడ్ లెర్నింగ్ పరికరాలు, ఏఐ ఆధారిత ప్రారంభ విద్యా వ్యవస్థలను కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరిత, జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు అక్కేశ్వర్ రావు, ఆర్డీఓ (హైదరాబాద్ ) రామకృష్ణ, నాంపల్లి తహశిల్దార్ నయీముద్దీన్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: Iswarya Menon : చామంతుల మధ్యలో మెరిసిపోతున్న ఐశ్వర్య.. ఏముంది మావా..