Maharashtra Crime: కష్టపడటానికి ఇష్టం లేని కొందరు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. సులువుగా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతుంటారు. ఈ క్రమంలో హత్యలు చేసేందుకు వెనుకాడరు. ఆ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. కోటి రూపాయల ఇన్యూరెన్స్ కోసం ప్లాన్ చేసి, అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి.
ఇన్యూరెన్స్ మనీ కోటి రూపాయల కోసం
మహరాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున కారులో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టాడు. మృతి చెందినది ఎవరు? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేశారు. చివరకు సెల్ఫోన్ మెసేజ్ ద్వారా ఆ గుట్టు బట్టబయలైంది. కీలక విషయాలు తెలిసి పోలీసులు షాకయ్యారు.
కారులోని మృతదేహానికి సంబంధించిన వ్యక్తి పేరు గణేశ్ చవాన్. అతడు బ్యాంక్ రికవరీ ఏజెంట్. రికవరీ ఏజెంట్ అంటే చెప్పనక్కర్లేదు. ఇన్యూరెన్స్ విషయంలో ఎలా క్లయిమ్ చేయాలో తెలుస్తుంది. అయితే తన ఇంటి లోన్ తీర్చేందుకు జీవిత బీమా డబ్బు కోసం చనిపోయినట్టు నమ్మించాడు గణేష్ చవాన్. యాక్సిడెంట్లో తాను చనిపోయినట్టు నమ్మించేలా స్కెచ్ వేశాడు.
ఒకడ్ని లేపేసి ప్రియురాలి మెసేజ్ పంపి
మద్యం మత్తులో ఓ వ్యక్తికి కారులో లిఫ్ట్ ఇచ్చాడు గణేష్. అతడ్ని చంపేసి, ఆ తర్వాత సజీవదహనం చేశాడు. ఆ తర్వాత తాను నిత్యం వాడే ఫోన్ను ఆ కారులో వదిలేశాడు. అయితే మనిషి మృతి చెందినా, కారులో ఫోన్ సేఫ్గా ఉండడంతో దర్యాప్తులో అనుమానాలు తలెత్తాయి. మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఎక్కడివాడు? వాడి జీవితంపై ఆరా తీశారు.
ఓ మహిళతో గణేష్కు సంబంధం ఉందని తేలింది. ఆమెను విచారిస్తున్న సమయంలో ప్రియురాలి అసలు గుట్టు బయటపెట్టింది. చనిపోయాడని భావించిన గణేశ్ చవాన్.. మరో ఫోన్ నుంచి తనకు మెసేజ్లు పంపుతున్నాడని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, కొత్త నెంబర్ని ట్రాక్ చేశారు.
ALSO READ: హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
అతడు సింధు దుర్గ్ జిల్లాలోని విజయదుర్గ్లో ఉన్నట్లు తేలింది.వెంటనే అతడ్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో తాను నేరం చేసిన అంగీకరించాడు గణేష్. ఇంటి లోన్ తీర్చేందుకు కోటి జీవిత బీమా డబ్బులు పొందాలని ఈ ప్లాన్ చేసినట్టు నిజాన్ని బయటపెట్టాడు. మరి గణేష్.. ఎవడ్ని చంపాడు? శనివారం రోజు గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు.
మద్యం మత్తులో ఉన్న అతడికి కారు డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు అసలు విషయం బయటపెట్టాడు. మృతదేహం తనదేనని నమ్మించేందుకు చేతికున్న బ్రాస్లెట్ను అక్కడే వదిలేశాడు. ప్రస్తుతం చవాన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు లాతూర్ పోలీసులు తెలిపారు.