Mother And Son Incident: మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కుమారుడు, కేవలం పెన్షన్ డబ్బుల కోసం తనను కన్నతల్లి అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉడిత్యాల గ్రామానికి చెందిన హనుమమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడు ఆంజనేయులుతో కలిసి నివసిస్తోంది. ఆంజనేయులు గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి బానిసై, పనిపాటలు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లికి వచ్చే ప్రభుత్వ పెన్షన్ డబ్బులపైనే కన్నేసిన అతను, వచ్చిన పింఛన్ డబ్బులన్నీ తనకే ఇవ్వాలని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.
అయితే తాజాగా తల్లికి పెన్షన్ డబ్బులు అందగా, ఆంజనేయులు తన తాగడానికి డబ్బులు కావాలని గొడవకు దిగాడు. హనుమమ్మ తన అవసరాల నిమిత్తం కొంత ఉంచుకుని, అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చింది. అయితే, మొత్తం డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆంజనేయులు మొండికేసి గొడవను పెద్దది చేశాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అతను, ఇంట్లోని బండరాయితో తల్లి తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హనుమమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Also Read: దారుణం.. కూతురిని ప్రేమించాడని స్తంభానికి కట్టేసి.. కొట్టి.. ఆ తర్వాత
చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలనగర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మద్యం మత్తులో కన్నతల్లిని పొట్టనబెట్టుకున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.