Wife Kills Husband: ఇటీవల కాలంలో భార్యలే భర్తలను అంతమొందిస్తున్న ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు గృహహింసకు మహిళలే బాధితులుగా ఉండేవారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క్షణికావేశం, అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాల కారణంగా మహిళలే నేరస్తులుగా మారుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో భర్తను భార్య దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.
మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో కేవలం టీవీ శబ్దం విషయంలో తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని కోరినందుకు ఆగ్రహానికి గురైన భార్య తన భర్తను కత్తితో పొడిచి హత్య చేసిన ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి టిడ్కో ఇళ్లలో నివసిస్తున్న మొహ్మద్, క్రాంతి దంపతుల మధ్య బుధవారం రాత్రి టీవీ సౌండ్ విషయమై వాగ్వాదం మొదలైంది. టీవీ శబ్దం ఎక్కువగా ఉండటంతో మొహ్మద్ తన భార్య క్రాంతిని సౌండ్ తగ్గించమని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ ముదిరింది. ఆవేశం ఆపుకోలేకపోయిన క్రాంతి ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని మొహ్మద్పై విచక్షణారహితంగా దాడి చేసింది.
కత్తిపోట్ల కారణంగా తీవ్ర రక్తస్రావమై మొహ్మద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు వచ్చేసరికి మొహ్మద్ ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప కారణానికే భర్తను చంపేంత స్థాయికి దంపతుల మధ్య గొడవ వెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రాంతి, మొహ్మద్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం.
Read Also: Nandyal Crime: శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!