Nandyal Crime: నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక భర్త.. తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.
మల్లికార్జున, కళ్యాణి దంపతులు గత కొంతకాలంగా నందికొట్కూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పచ్చని సంసారంలో మద్యం చిచ్చు పెట్టింది. మల్లికార్జున మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే.. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మల్లికార్జున, భార్య కళ్యాణితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన అతను.. ఇంట్లో ఉన్న పెట్రోల్ను ఆమెపై పోసి నిప్పంటించాడు.
మంటలు అంటుకోవడంతో కళ్యాణి భీకరమైన కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. అప్పటికే కళ్యాణి తీవ్రంగా గాయపడటంతో.. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు మల్లికార్జున ఘటన తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు , మద్యపానం వల్ల కలిగిన ఘర్షణే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు మల్లికార్జున కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో తండ్రి చేసిన ఈ ఘాతుకం ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.
Also Read: తెలంగాణ ఏమైనా నీ అయ్య జాగీరా..? కేసీఆర్కు కడియం శ్రీహరి సూటి ప్రశ్న