Mukesh Chandrakar : జర్నలిజం అంటే ప్రజల పక్షాన నిలబడడం, పేదల గొంతుకగా మారడం.. వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నించి సరిచేసేందుకు ప్రయత్నించడం. అలానే.. భావించి మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీష్ గఢ్ లోని బస్తర్ లో సాహసోపేతంగా వార్తలు రాస్తూ.. మావోను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ యువ జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు. అయితే.. ఈ దుర్మార్గానికి పాల్పడింది మావోయిస్టులు కాదు, ఈ ఆధునిక సమాజంలో పెత్తందారులుగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి. అవినీతి, అక్రమాలతో ప్రజల సొమ్ముల్ని దోచుకుంటున్న ఓ అవినీతి కాంట్రక్టర్. తన అవినీతిపై యువ జర్నలిస్ట్ పోరాటానికి భయపడిపోయి.. అతని ఊపిరి తీశాడు. మాట్లాడేందుకని పిలిచి, దారుణంగా హత్యే చేశాడు. ఇప్పుడు.. ఈ ఘటన ఛత్తీష్ గఢ్ తో పాటు దేశమంతటా చర్చకు దారితీసింది. జర్నలిస్టుల భద్రత గురించి ఆందోళనలు పెంచుతోంది.
ఏం జరిగింది..
మావోయిస్టులకు అడ్డాగా నిలిచి, పోలీసులకు, ప్రభుత్వాలకు సైతం సవాళుగా నిలిచే జిల్లా ఛత్తీష్ గఢ్ లోని బస్తర్ జిల్లా. ఇక్కడ ఎలాంటి విధులు నిర్వహించడం అయినా కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. అలాంటి చోట.. మావోల చర్యలు, కార్యకలాపాలతో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధైర్యంగా కథనాలు రాస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే.. స్థానిక జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్. జనవరి 1 తేది నుంచి ఈ యువకుడు కనిపించడం లేదని, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా.. ఈ యువ జర్నలిస్ట్ మృతదేహం స్థానికంగా ఓ లేఅవుట్ లోని నీటి ట్యాంక్ లో లభించింది. పోలీసుల ఫోన్ ట్రేసింగ్ లోనూ.. చివరిగా ఇక్కడే ముఖేష్ ఉన్నట్లు తేలింది. కాగా.. ఈ యువకుడిని చంపేసి, నీటి ట్యాంకులో పడేశారని స్పష్టం తెలుస్తోందంటున్నారు.. పోలీసులు, స్థానికులు. దాంతో.. అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కారణాలు ఏమై ఉండొచ్చు..
యువ జర్నలిస్ట్ మృతదేహం స్థానిక కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ అనే వ్యక్తి లే అవుట్ లోని ట్యాంక్ లో ఉంది. గతంలో.. ఈ కాంట్రాక్టర్ కి సంబంధించిన అవినీతిపై ముఖేష్ కథనాలు చేశాడు. బస్తర్లో రూ. 120 కోట్ల రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ముఖేష్ వెలుగులోకి తీసుకువచ్చారు. దాంతో.. కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ప్రాజెక్టులు, కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై.. కాంట్రాక్టర్ కి ముఖేష్ కి మధ్య విభేధాలున్నాయి.
బస్తర్ ప్రాంతంలో ఈ కాంట్రక్టర్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. తనకున్న లాబీని ఉపయోగించుకుని పనులు దక్కించుకుంటాడని, లాభాల కోసం అవినీతికి పాల్పడతాడనే ప్రచారం ఉంది. అలాగే.. అధికారులకు లంచాలు ఇవ్వడం, మాట వినని అధికారుల్ని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డాడనే తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతని వ్యాపార కార్యకలాపాల మీద ప్రభుత్వం దృష్టి సారించడంతో సురేష్ చంద్రకర్ ఆగ్రహానికి గురయ్యాడని చెబుతున్నారు.
సురేష్ చంద్రకర్ సోదరుడు రితేష్ చంద్రకర్.. కొత్త ఏడాది సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి రావాలని ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లినప్పటి నుంచే ముఖేష్ కనిపించకుండా పోయాడని.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫోన్ ట్రాకింగ్ లోనూ.. ముఖేష్ చంద్రకర్ చివరి ఫోన్ లొకేషన్.. కాంట్రాక్టర్ లే అవుట్ లోనే గుర్తించారు. సరిగా అక్కడే.. అతను చనిపోయి కనిపించడంతో ఆందోళనలు రేకెత్తాయి.
ఈ అంశంపై దృష్టి సారించిన అధికారులు సీసీ టీవీ పుటేష్ ని సైతం పరిశీలిస్తున్నారు. అతని లొకేషన్, సీసీ టీవీ రికార్డింగ్ ల్లోనూ అతను.. కాంట్రాక్టర్ సోదరుడు రితేష్ చంద్రకర్ మీటింగ్ కు వెళ్లినట్లు గుర్తించారు. హత్య ఉదంతం బయటకు రావడంతో యువ జర్నలిస్ట్ హత్యతో రాష్ట్ర వ్యాాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దాంతో.. పోలీసు యంత్రాంగం కూడా వెంటనే స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఇప్పటికే కాంట్రాక్టర్తో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. కాంట్రాక్టర్, అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. సురేష్ సోదరుడు, హత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న రితేష్ చంద్రకర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రాంతంలో అవినీతిపై పోరాడుతున్న జర్నలిస్టులు తరచూ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ హత్యతో మరోమారు వెలుగులోకి వచ్చాయి.
ఎవరీ ముఖేష్ చంద్రఖర్..
ముఖేష్ చంద్రకర్ ధైర్యవంతుడైన జర్నలిస్ట్. ఈ ప్రాంతంలోని సమస్యలపై మంచి అవగాహన ఉన్న యువకుడని తోటి జర్నలిస్టులు చెబుతున్నారు. ఇతని ధైర్యానికి.. ఓ ఉదాహరణగా 2021లో బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన CRPF సిబ్బందిని విడుదల చేయించడాన్ని చూపుతున్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో.. ముఖేష్ కీలకంగా వ్యవహరించి.. CRPF కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ను విడుదల చేయడంలో కీలకంగా పనిచేశాడు. ఇతని కృషికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు ప్రశంసించాయి.
Also Read : తమిళనాడులోని బాణా సంచా కర్మాగారంలో పేలుడు..
దాదాపు పదేళ్ల పాత్రికేయ అనుభవంతో ఉన్న ముఖేష్.. ఓ జాతీయ వార్తా ఛానెల్లో స్ట్రింగర్గా పనిచేశాడు. తర్వాత నక్సల్ సంబంధిత సమస్యలు, గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తూ “బస్తర్ జంక్షన్” అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.