దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం మధ్యాహ్నం పెను ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ములంద్ వెస్ట్ ప్రాంతంలోని ఎల్బీఎస్ రోడ్డులో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన తీరు..
ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల 20 నిమిషాల సమయంలో, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో మెట్రో పిల్లర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో పిల్లర్కు సంబంధించిన ఒక భారీ కాంక్రీట్ భాగం అకస్మాత్తుగా ఊడి కింద వెళ్తున్న ఆటో రిక్షా మరియు ఒక కారుపై పడింది. ఈ ఊహించని ప్రమాదంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు, మెట్రో ఉన్నతాధికారులు మరియు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో వాహనాల భాగాలను తొలగించి బాధితులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో రామ్ధన్ యాదవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బాధితుల వివరాలు ఇవే..
గాయపడిన వారిని రాజ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్, దీపా రుహియాగా గుర్తించారు. వీరిలో రాజ్ కుమార్ యాదవ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
నిర్లక్ష్యమే కారణమా..?
ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ఎల్బీఎస్ రోడ్డుపై పనులు జరుగుతున్నప్పుడు కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని వారు ఆరోపిస్తున్నారు. పిల్లర్ పనులు చేసేటప్పుడు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ను మళ్లించాల్సి ఉండగా.. ఆ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని మండిపడుతున్నారు.
ట్రాఫిక్ జామ్..
మెట్రో పిల్లర్ కూలడంతో ఎల్బీఎస్ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శిథిలాలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి అధికారులకు గంటల సమయం పట్టింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ALSO READ: Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన కంటైనర్.. స్పాట్ లోనే