Double Murder Case: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది మృతురాలితో సహజీవనం చేస్తున్న శివరాజ్ అని నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన చంద్రకళకు, నారాయణపేట జిల్లా కర్ని గ్రామానికి చెందిన శివరాజ్ అనే క్యాబ్ డ్రైవర్తో గత మూడేళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారు సహజీవనం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో వీడిన డబుల్ మర్డర్ మిస్టరీ..
చంద్రకళ తన 13 ఏళ్ల కుమారుడు రేవంత్తో కలిసి నాలుగు రోజుల క్రితమే తెల్లాపూర్లోని జేపీ కాలనీకి చేరుకుంది. అక్కడ శివరాజ్, చంద్రకళ తాము భార్యాభర్తలమని ఇంటి యజమానికి చెప్పి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. బాలుడు రేవంత్ను తమ కుమారుడిగా పరిచయం చేసుకుని అక్కడ నివాసం ఉండటం ప్రారంభించారు. అయితే, వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
వేధింపులు తట్టుకోలేక శివరాజ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
శివరాజ్ వేధింపులు తట్టుకోలేక చంద్రకళ రెండు రోజుల క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసింది. తనను ఇబ్బంది పెడుతున్నాడని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. చంద్రకళ తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని శివరాజ్ తీవ్ర అవమానంగా భావించాడు. ఆ కోపంతోనే ఆమెను, ఆమె కుమారుడిని అంతం చేయాలని పథకం పన్నాడు.
కోపంతో చంద్రకళ, ఆమె కొడుకు రేవంత్ను హత్య చేసిన శివరాజ్
నిన్న ఉదయం ఎంతసేపటికీ వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా.. చంద్రకళ, రేవంత్ రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. నిందితుడు శివరాజ్ కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి, తీవ్ర గాయాలతో మాట్లాడలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కొన ఊపిరితో ఉన్న శివరాజ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పహారా ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో చంద్రకళ పెట్టిన పోలీస్ కేసే ఈ జంట హత్యలకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్లో ఆరుగురు!
చిన్న వివాదం.. చివరికి ఇద్దరు ప్రాణాలు బలి
సహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పెరిగిన కక్ష, చివరికి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. తల్లీకొడుకుల హత్యతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడు శివరాజ్ కోలుకున్న తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.