Nacharam: హైదరాబాద్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ పూట అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, తమ్ముడిని కటకటాల వెనక్కి నెట్టింది. కేవలం ఒక మద్యం గ్లాస్ కోసం జరిగిన గొడవ, కన్న అన్ననే భవనం పైనుంచి తోసేసి చంపేలా చేసింది.
మృతుడు స్టీఫెర్డ్ రోహన్ సాయర్స్ (30), నిందితుడు లేనర్డ్ లయనెల్ సాయర్స్ (28) అన్నదమ్ములు. వీరు నాచారంలోని తమ నివాసంలో నివసిస్తున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో, బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ తమ నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం మేడపై మద్యం సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
మద్యం సేవిస్తున్న క్రమంలో, అన్న రోహన్ తన తమ్ముడు లయనెల్ను మద్యం పోసుకోవడానికి గ్లాస్ అడిగాడు. ఆ గ్లాస్ విషయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద వివాదంగా మారింది. మద్యం మత్తులో ఉన్న లయనెల్ ఆగ్రహంతో ఊగిపోయి, తన అన్న రోహన్ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు.
సుమారు మూడు అంతస్తుల ఎత్తు నుంచి రోహన్ కింద పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే రోహన్ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
ఘటన జరిగిన కేవలం ఐదు గంటల్లోనే నిందితుడైన తమ్ముడు లయనెల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పండుగ పూట అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ గొడవ ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.
Read Also: పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యపై జగన్ ఫైర్.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆగ్రహం!