Congress Leader: నాగర్ కర్నూల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం జరిగిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సర్పంచ్ ఎన్నికల్లో తనకు పార్టీ మద్దతు ఇవ్వలేదన్న మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బంగారయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కలకలం రేగింది. వెంటనే స్పందించిన పోలీసులు, పార్టీ శ్రేణులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బంగారయ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
బంగారయ్య స్వస్థలమైన శ్రీపురం గ్రామం నాగర్ కర్నూల్ మండల పరిధిలో ఉంది. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని, ఇందుకు పార్టీ మద్దతు అవసరమని ఆయన గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే ఈసారి శ్రీపురం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ అభ్యర్థికి కేటాయించడంతో, తనకు అవకాశం దూరమైందన్న భావనతో తీవ్రమైన నిరాశకు లోనైనట్లు సమాచారం. దీనికి తోడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి మరో నాయకుడు నరసింహారెడ్డికి మద్దతు తెలుపుతున్నారన్న వార్తలు బంగారయ్యను మరింత మనస్తాపానికి గురిచేశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బంగారయ్య.. ఈరోజు ఉదయం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కొంతసేపు బాధతో అక్కడే ఉండిపోయాడు. ఆపై అందరి ముందే పురుగుల మందు తాగడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే గుర్తించిన సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అప్పటికే కొంత మందు తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: సంవిధాన్ శక్తి రన్: రాజ్యాంగ స్ఫూర్తిని చాటిన 2 వేల మంది పరుగులు
ఆసుపత్రిలో బంగారయ్యకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.