Current Situation in Puvarthi: మాద్వి హిడ్మా.. మావోయిస్టు పార్టీలో అగ్రనేత. భద్రతా బలగాలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన సెంట్రల్ కమిటీ సభ్యుడు.. PLGA కమాండర్. అలాంటి హిడ్మా స్వగ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అతను పుట్టి పెరిగిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది? ఇదే విషయం తెలుసుకునేందుకు బిగ్ టీవీ ఓ సాహసమే చేసింది. హిడ్మా సొంత ఊరికి చేరుకునే ప్రయత్నం చేసింది.
పూవర్తి.. హిడ్మా స్వగ్రామం. ఇది ఉన్నది చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో. కానీ ఇక్కడికి చేరుకోవడానికి బిగ్టీవీ ఓ సాహసమే చేసింది. సాహసం అని ఎందుకు అనాల్సి వస్తుందనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది. హిడ్మా మృతి తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఏమాత్రం నార్మల్గా లేవు. అడుగడుగునా చెకింగ్లు.. ఎక్కడ చూసిన భద్రతా బలగాలే.
ఇలా అనేక అడ్డంకులను దాటుకుంటూ పూవర్తికి చేరుకునే ప్రయత్నం చేసింది బిగ్టీవీ. ఇప్పటికి కూడా ప్రయత్నం అంటున్నామంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడు పుట్టి పెరిగిన ఊరుకు వెళ్లాలంటే ఇప్పటికీ రోడ్డు లేదు. ఇప్పుడిప్పుడే అక్కడ రోడ్డును నిర్మిస్తున్నారు అధికారులు.
ఆ కంకర రోడ్డుపైనే చాలా దూరం ప్రయాణం చేసింది బిగ్టీవీ టీమ్. కానీ ఆ ప్రయాణం కూడా అంత సాఫీగా జరగలేదు. ఎట్టకేలకు అతని గ్రామానికి చేరువయ్యింది బిగ్ టీమ్. కానీ ఇక అక్కడి నుంచి ఏ వెహికల్ వెళ్లే పరిస్థితి లేదు. ఇక నడక దారినే పయనం ప్రారంభించింది బిగ్టీవీ టీమ్.
ఇదే హిడ్మా పుట్టి, పెరిగిన ఇల్లు.. . అతను తుపాకీ పట్టుకోవడానికి ఇంటిని వదిలి వెళ్లినప్పటికి ఉన్న గుడిసెలోనే ఇప్పటికీ ఉంటుంది ఆ కుటుంబం. వారి జీవన పరిస్థితులు ఒక్కసారి చూడండి. అదే పేదరికం. ఇక్కడి వారికి కట్టుకునేందుకు సరైన బట్టలు లేవు.. సరైన తిండి లేదు. వారి ఆరోగ్యం దెబ్బతింటే ఆసుపత్రికి వెళ్లాలన్నా.. ఏదైనా అవసరం కోసం కనీసం ఏదైనా కొనుక్కోవాలన్నా.. ఎంత దూరం నడవాలో ఇప్పటికే చూపించాం కదా. ఇదీ అక్కడి పరిస్థితి.
హిడ్మాను తలుచుకొని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఇంటిని వదిలి ఏళ్లయ్యింది. ఈ మధ్య కాలంలో చూసింది చాలా తక్కువసార్లే.. ఇంటికి వచ్చింది ఒకే ఒకసారి. తన చేతులతో పెంచుకున్న బిడ్డకు తన చేతితోనే చితి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కన్నీరుమున్నీరవుతుంది ఆ తల్లి.
చూసి దశాబ్ధం దాటింది.. మాట్లాడి జమానా అయ్యింది.. అసలు హిడ్మా ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అనేది తమకు ఎప్పుడూ మిస్టరీనే అంటున్నాడు హిడ్మా అన్న మోయ హిడ్మా. అందరికి హీరో కావొచ్చు కానీ.. తమ కుటుంబానికి అతను చేసింది ఏం లేదని చెప్తున్నాడు అతను.
హిడ్మా మాత్రమే కాదు.. మరో మావోయిస్టు కీలకనేత బోర్సే దేవ. అతడిది కూడా పూవర్తి దగ్గరి గూడెమే. ఆ తల్లిది కూడా ఇదే ఆవేదన. తన కొడుకు ఎక్కడ ఉన్నాడో..? ఎలా ఉన్నాడో..? అనే ఆవేదన తనది. కుటుంబాన్ని వదిలిపెట్టి.. అడవుల బాట పట్టారు.. అసలు బతికున్నాడో లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి.
మావోయిస్టు పార్టీలో హిడ్మా చాలా కీలకమైన వ్యక్తి. అందుకే అతని సొంత గ్రామంలోనే ఏకంగా బేస్ క్యాంప్ను ఏర్పాటు చేశాయి కేంద్ర బలగాలు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉంది? హిడ్మా మరణం తర్వాత బలగాలు రిలాక్స్ అయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టీమ్.
హిడ్మా కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నారో చూశాం.. అది ఎంతటి మారుమూల ప్రాంతమో కూడా చూశాం. ఇలాంటి ప్రాంతంలో జరిగిన హిడ్మా అంత్యక్రియలకు కూడా భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. వారంతా కూడా చుట్టుపక్కల ఉన్న గూడెంలకు చెందిన ప్రజలే.
అసలు ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? మావోయిస్టుల వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నది ప్రభుత్వాలు చెప్పే మాట. కాదు అభివృద్ధి లేదు కాబట్టే మావోయిస్టుల్లో చేరాల్సి వస్తుందనేది అక్కడి ప్రజల మాట. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసింది బిగ్టీవీ టీమ్.
Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై సీఎం రేవంత్ ఫోకస్
అభివృద్ధిపై ఎవరి మాటేలా ఉన్నా.. ఎవరి కారణాలు ఎలా ఉన్నా.. అభివృద్ధి కాలేదన్నది నిజం. ఆ ప్రాంతం వెనకబడిందన్నది నిజం. అక్కడి ప్రజలు కనీస సౌకర్యాల కోసం.. పౌష్టిక ఆహారం కోసం పోరాడుతున్నారనేది నిజం. మరి ఇప్పటికైనా అక్కడి పరిస్థితులు మారుతాయా? ప్రభుత్వాలు అభివృద్ధి ఫలాలను అక్కడి ప్రజలకు అందిస్తాయా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Story By vamshi Krishna, Bigtv