Nagar Kurnool: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం మూడు నెలల వయసున్న పసికందు నీటి తొట్టిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో, బాబు తల్లి నీలమ్మ తన పుట్టినిల్లైన పాలెం గ్రామంలోనే ఉంటోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడటానికి భర్త తరపు కుటుంబ సభ్యులు నీలమ్మ ఇంటికి వచ్చారు. సంధి కోసం వచ్చిన సమయంలోనే ఈ దారుణం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి సమయంలో బాబుకు పాలు ఇచ్చేందుకు తల్లి నిద్రలేచి చూడగా, పక్కనే ఉండాల్సిన బాబు కనిపించలేదు. ఆందోళనతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతకగా, చివరకు ఇంటి సమీపంలోని నీటి తొట్టిలో బాబు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే బయటకు తీసినప్పటికీ బాబు అప్పటికే మృతి చెంది ఉన్నాడు.
ఈ మరణం వెనుక బాబు తండ్రి హస్తం ఉందని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు బలంగా అనుమానిస్తున్నారు. భార్యాభర్తల గొడవల నేపథ్యంలో కక్ష పూరితంగానే పసికందును నీటి తొట్టిలో వేసి చంపి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు.
Also Read: పోలవరం జిల్లాలో ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. స్పాట్లో నలుగురు
ప్రస్తుతం బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.