Osmania Medical College: హైదరాబాద్లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన సీనియర్లే రౌడీల్లా ప్రవర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో (డెంటల్ వింగ్) జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
కాలేజీలో కొత్తగా చేరిన బీడీఎస్ (BDS) మొదటి సంవత్సరం విద్యార్థులను కొంతమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు వేధింపులకు గురిచేశారు. హాస్టల్ గదుల్లో వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారు. భయపడిపోయిన జూనియర్లు ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Also Read: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దం.. విపక్షాలకు మంత్రి అడ్లూరి ఓపెన్ ఛాలెంజ్!
12 మందిపై కేసు నమోదు
బాధిత విద్యార్థుల ఫిర్యాదుపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ వెంటనే స్పందించారు. ఆయన ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాగింగ్కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ‘తెలంగాణ ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్’ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
6 నెలల పాటు సస్పెన్షన్
ర్యాగింగ్ పట్ల కాలేజీ యాజమాన్యం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేసింది. నిందితులుగా తేలిన ఆ 12 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ను ఆరు నెలల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు ఇలాంటి అరాచకాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read: వరంగల్కు జనసేనాని పవన్ కళ్యాణ్.. నేటి పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!