Hanamkonda Crime: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బుధవారం నాడు అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పరకాల బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బస్టాండ్లోకి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఆమెను కబళించింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబలక్ష్మి అనే వృద్ధురాలు తన వ్యక్తిగత పనుల నిమిత్తం పరకాల పట్టణానికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్లేందుకు బస్టాండ్లోకి నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో లోపలికి వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆమె బస్సు ముందు టైర్ కింద పడిపోయారు.
బస్సు టైర్ ఆమె శరీరం పైనుంచి వెళ్లడంతో సాంబలక్ష్మి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
మృతురాలు వెంకటాపురం నివాసిగా గుర్తించడంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాంబలక్ష్మి మరణ వార్త తెలియగానే ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనాల వేగంపై నియంత్రణ ఉండాలని, పాదచారుల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన పరకాల ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Hydroponic Ganja: ఎయిర్ పోర్ట్లో డ్రగ్స్ కలకలం.. రూ.4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం