Kamareddy District: తెలంగాణలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. వారం రోజుల వ్యవధిలో ఓ జిల్లాలో దాదాపు 600 శునకాలను దారుణంగా హత మార్చారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఫిర్యాదు చేయడంతో ఐదుగురు సర్పంచ్లపై కేసు నమోదు అయ్యింది. అసలేం జరిగింది?
600 వీధి కుక్కలపై విష ప్రయోగం
కామారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. మాచారెడ్డి పరిధిలో భవానీపేట, ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్ పల్లిలో సర్పంచ్ల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. జనవరి ఆరు నుంచి తొమ్మిది దాదాపు 600 వీధి కుక్కలకు విష పూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్టు తెలుస్తోంది. గ్రామ సర్పంచ్లు నియమించిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.
శునకాల కళేబరాలను గ్రామ శివార్లలో పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలియగానే జంతు సంరక్షణ సంస్థల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, కళేబరాలను వెలికి తీసి పోస్ట్మార్టం చేయించారు. శాంపిళ్లను ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
కామారెడ్డి జిల్లాలో దారుణం, ఐదుగురు సర్పంచ్లపై కేసు
ఈ ఘటనలో ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 కింద ఆయా కేసులు నమోదయ్యాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో వీధి కుక్కల బెడదను తొలగిస్తామని హామీల నేపథ్యంలో ఈ విధంగా చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వీధి కుక్కలపై ఘాతుకాన్ని జంతు సంరక్షణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి సమస్య పరిష్కరించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ నియమాల ప్రకారం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. క్రూరంగా హత్యలు చట్టవిరుద్ధమని అంటున్నారు.
ALSO READ: నందిగామలో దారుణం.. బిడ్డని అమ్మకానికి పెట్టిన తల్లి
ఈ వ్యవహారంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 1950 నుంచి శునకాల సమస్య ఉందని, ఈ అంశాన్ని పార్లమెంటు పరిశీలిస్తోందని వ్యాఖ్యానించింది. దేశంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. వివిధ సంస్థల నుంచి అందుతున్న నివేదికల ప్రకారం దాదాపు 6 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా రేబిస్ మరణాలు భారత్లో జరుగుతున్నాయి.
దాదాపు 36 శాతంపై మాటే. ఏడాదికి 18 వేల నుంచి 20 వేల మంది వరకు రేబిస్తో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా మరణాల్లో 30 నుంచి 60 శాతం మంది చిన్నారులు ఉన్నారు. వీటి బారిన పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారట. స్కూళ్లు, ఆసుపత్రుల సహా పలు ప్రాంతాల్లో వీటి బెడద ఎక్కువస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/bigtvtelugu/status/2011304095081250888