CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరనున్నారు. జనవరి 20 నుంచి 23 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ వేదికగా ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30’, ‘తెలంగాణ AI హబ్’ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.
అమెరికా పర్యటన.. పెట్టుబడుల వేట..
దావోస్ పర్యటన ముగిసిన అనంతరం, జనవరి 24న ముఖ్యమంత్రి నేరుగా అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ వారం రోజుల పాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఎన్ఆర్ఐ (NRI) ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా బోస్టన్ వంటి నగరాల్లో పర్యటించి, హార్వర్డ్ వంటి ప్రముఖ విద్యా సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
జిల్లాల పర్యటన..
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నెల 16న నిర్మల్, 17న మహబూబ్నగర్ (జడ్చర్ల), 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఆయన పర్యటనలు ఖరారయ్యాయి. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ (IIIT) నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, ఖమ్మంలో సీపీఐ వందేళ్ల ఉత్సవాల బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనల ద్వారా మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.
అలాగే జనవరి 18వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి ములుగు జిల్లాలోని మేడారంలో బస చేయనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ‘మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర’ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. జనవరి 19న ఉదయం, నూతనంగా పునర్నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలను ఆయన ప్రారంభించి, అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుని దావోస్కు ప్రయాణమవుతారు.
Also Read: థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్లో 22 మంది మృతి!
ఆర్థిక లక్ష్యం..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ పర్యటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత రెండు ఏళ్లలో దావోస్ పర్యటనల ద్వారా సుమారు రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. ఈసారి కూడా భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్ వంటి మెగా ప్రాజెక్టులను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం ప్రణాళికలు సిద్ధం చేశారు.
దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 19న మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ పర్యటనకు సీఎం
20 నుంచి 23 వరకు ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న రేవంత్ బృందం
అనంతరం 24న దావోస్ నుంచి యూఎస్కు రేవంత్
ఫిబ్రవరి 1న రాష్ట్రానికి తిరిగిరానున్న సీఎం… pic.twitter.com/6O0luB0bR5
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2026