Shadnagar Baby Incident: దారుణం.. ఓ తల్లి నవ మాసాలు మోసి ఎంతో భాధను భరించి శిశువుకు జన్మనిస్తుంది. ఎలాంటి కష్టాల్లో ఉన్న బిడ్డను మాత్రం అపురూపంగా చూసుకుంటుంది. అలాంటి తల్లి ఇక్కడ శిశువును అమ్మకానికి పెట్టింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం, ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీకి చెందిన లాల్ సింగ్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళ తన సొంత పసికందును విక్రయించేందుకు సిద్ధపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేదరికమో లేదా ఇతర వ్యక్తిగత కారణాలో తెలియదు కానీ, అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వెంటనే షాద్నగర్ పోలీసులు, ఐసీడీఎస్ (ICDS) అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లాల్ సింగ్ తండాకు చేరుకున్న పోలీసులు, ఆ మహిళను, పసికందును గుర్తించారు. బిడ్డను విక్రయించే ప్రయత్నాన్ని అడ్డుకొని, ఆ చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో తండాలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు సేకరించారు.
అనంతరం అధికారులు ఆ పసికందును సురక్షితంగా తరలించి, హైదరాబాద్లోని శిశు విహార్కు అప్పగించారు. ప్రస్తుతం ఆ చిన్నారి అధికారుల సంరక్షణలో క్షేమంగా ఉంది. శిశువు ఆరోగ్యంపై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బిడ్డను విక్రయించడానికి గల అసలు కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా మధ్యవర్తులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
Also Read: అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్న శబరిగిరి.. మకరజ్యోతి దర్శనం కోసం భక్తుల నిరీక్షణ
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేదా బిడ్డను సాకలేని పరిస్థితి ఉన్నా, ఇలా అమ్మకానికి పెట్టకుండా ప్రభుత్వ కేంద్రాలను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
పసికందును అమ్మకానికి పెట్టిన గిరిజన మహిళ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం
ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీ లాల్ సింగ్ తండాలో పసికందును విక్రయించేందుకు యత్నం
విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న పోలీసులు
పసికందును శిశు విహార్ అధికారులకు అప్పగించిన పోలీసులు pic.twitter.com/O0DhF1WluU
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2026