Prakasam District Crime: ప్రకాశం జిల్లాలో వరుస ఘటనలు చూస్తే, నివ్వెర పోవాల్సిందే. 5 రోజుల క్రితం తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన జిల్లాలోని దొనకొండలో జరిగింది. ఆ ఘటన మరువక మునుపే కుమారుడిని ఓ తల్లి ముక్కలు ముక్కలుగా చేసి హత్యకు పాల్పడినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఘటన జిల్లాలోని కంభంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కంభం లోని మేదర బజార్ లో ఓ మహిళ నివసిస్తోంది. ఈమెకు నలుగురు సంతానం. వారిలో శ్యాంబాబు ఒకడు. అయితే శుక్రవారం శ్యాంబాబు స్థానికంగా గల పంట కాలువలో మృతదేహంగా కనిపించాడు. స్థానికులు అటువైపుగా వెళ్లిన సమయంలో దుర్వాసన రాగా, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ గల ఓ సంచిలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, స్థానికుల ద్వారా వివరాలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. చివరకు మృతుడు శ్యాంబాబుగా పోలీసులు ధ్రువీకరించారు.
అయితే శ్యాంబాబు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, అందుకే శ్యాంబాబును హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అది కూడా మృతుడి తల్లి , మరొకరు కలిసి ఈ హత్య చేసినట్లు ప్రచారంలో ఉంది. శ్యాంబాబు శరీరాన్ని మూడు ముక్కలు చేసి గోనె సంచిలో విసిరి వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం బయటపడినట్లు సమాచారం అందుకున్న మార్కాపురం డిఎస్పీ నాగరాజు, కంభం సిఐ మల్లిఖార్జున రావు, ఎస్సై నరసింహారావులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Also Read: పుల్వామా దాడికి ఐదేళ్లు – ఉగ్రవాదులపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంది
స్థానికుల ద్వారా హత్యకు గల కారణాలు పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రచారం సాగుతున్నట్లు శ్యాంబాబును తల్లి హత్య చేసిందా? హత్యకు గల కారణాలు ఏమిటి? ముక్కలు ముక్కలుగా చేసేంత తప్పు ఏం జరిగిందనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు పలు సాక్ష్యాలు కూడా లభ్యమైనట్లు సమాచారం. మొత్తం మీద కొడుకును కన్నతల్లి హత్య చేసిందని వదంతులు వ్యాపించగా, ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. పూర్తి విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.