పంజాబ్లోని మురాదురాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగుచూసింది. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం, గందరగోళం నెలకొన్నాయి. తన పెళ్లికి కేవలం రెండు వారాల సమయం ఉందనగా.. ఓ వధువు తన స్నేహితురాలితో కలిసి ఇంటి నుంచి పారిపోవడం అటు స్థానికంగానూ.. ఇటు సోషల్ మీడియాలోనూ కలకలం రేపింది.
ప్రేమలో పడ్డ మిత్రులు..
మురాదురాకు చెందిన లఖ్వీందర్ కౌర్ అనే యువతికి, సమీప గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఈనెల (జనవరి) 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు పెళ్లి పనుల్లో నిమగ్నమై, ఆహ్వాన పత్రికలు పంచుతూ బిజీగా ఉన్నారు. అయితే, అనూహ్యంగా లఖ్వీందర్ కౌర్ తన స్నేహితురాలు సునీతతో కలిసి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలించగా.. వీరిద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయింది.
స్వలింగ వివాహానికి నిర్ణయం..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తామిద్దరం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని, విడివిడిగా ఉండలేమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాము స్వలింగ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. అందుకే ఈ అడుగు వేసినట్లు సునీత వెల్లడించింది. సమాజం లేదా కుటుంబ సభ్యులు తమ బంధాన్ని అంగీకరించరనే భయంతోనే పెళ్లికి ముందే పారిపోయినట్లు వారు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన..
మరోవైపు, వధువు లఖ్వీందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఈ ఘటనతో షాక్కు గురయ్యారు. పెళ్లి ఏర్పాట్లు దాదాపు పూర్తయిన తరుణంలో ఇలా జరగడం తమ పరువు తీయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుడి కుటుంబం కూడా ఈ పరిణామంతో విస్మయానికి లోనైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో, స్థానిక చుట్టుపక్కల గ్రామాల్లో హాట్ టాపిక్గా మారింది.
ALSO READ: Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!