Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీటి బారినపడి తప్పించుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని బారి నుంచి తప్పించుకోలేక మాజీ ఐపీఎస్ అధికారి తనను తాను ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఘటన స్థలం నుంచి 12 పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ మోసం బారిన మాజీ ఐపీఎస్
మాజీ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ ఇటీవల రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పాటియాలాలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ తనను తాను కాల్చుకోవడం కలకలం రేపింది. ఆయన వ్యవహారం తెలియగానే పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
అంబులెన్సులో ఆయన్ని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం మాజీ ఐపీఎస్ ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 24 గంటలు గడిస్తేనే గానీ చెప్పడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.
గన్తో కాల్చుకున్న మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్
సోమవారం మధ్యాహ్నం సమయంలో సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారట మాజీ ఐపీఎస్. ఘటనా స్థలం నుండి 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాజీ ఐపీఎస్ చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని తెలిపారు.
పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి ఆ లేఖలో కీలక విషయాలు రాసుకొచ్చారు. డీబీఎస్ వెల్త్ ఈక్విటీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఆన్లైన్ పెట్టుబడి మోసంలో ఎలా ఇరుక్కున్నారో వివరించారట. దాదాపు రూ. 8 కోట్ల పైచిలుకు ఆన్లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ముగ్గురు మృతి
ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన కూడబెట్టిన కోటి రూపాయలు కాగా, మిగతా ఏడు కోట్ల రూపాయలు స్నేహితులు, బంధువుల నుండి అప్పుగా తీసుకున్నారు. కుటుంబంపై ఆర్థిక భారం గురించి పశ్చాత్తాపం, భయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో తన చర్యలకు మరెవరు బాధ్యత వహించకూడదని పదే పదే రాసుకొచ్చారు.
1990 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి చాహల్ ఆర్థిక మోసం గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సైబర్ నేరస్థులు తనను ఏ విధంగా మోసం చేశారని అందులో వివరించారు. తన కుటుంబానికి రక్షణ, సహాయం అందించాలని పేర్కొన్నారు. రుణదాతలు ఒత్తిడి చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.