Guntur Crime: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాద ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ప్రమాదానికి కారణమైన ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
చిలకలూరిపేట కారు ప్రమాద ఘటనలో కొత్త విషయాలు
ఈ కేసులో ప్రధాన నిందితుడి తండ్రి ఏఎస్ఐ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) శ్రీనివాస్, పోలీసు శాఖలోని కొందరు ఉన్నతాధికారుల అండదండలతో వెంకటనాయుడు చాలాకాలంగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పలుకుబడిని ఉపయోగించి ఏఎస్ఐ శ్రీనివాస్ ఈ కేసును బలహీనపరిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారం పోలీసు డిపార్ట్మెంట్లో అంతర్గత చర్చకు తెరలేపింది. ప్రధాన నిందితుడి తండ్రి ఏఎస్ఐ శ్రీనివాస్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆయనను సస్పెండ్ చేయకుండా, కేవలం కార్లు కొనుగోలు చేసిన పాపానికి చిలకలూరిపేట ఎస్ఐని బలి చేశారంటూ కొందరు ఖాకీలు మాట్లాడుకుంటున్నారు.
నిందితుల కస్టడీ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ
ఏఎస్ఐ శ్రీనివాస్, అతడి కొడుకు వెంకటనాయుడు అధికారుల అండదండలతో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసు చుట్టూ అక్రమాలు, అధికార దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పోలీసు అధికారులు ఈ కేసు దర్యాప్తు తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసును సిట్ లేదా సీఐడీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తేనే తండ్రీ-కొడుకుల అక్రమాల వెనుకున్న అసలు ఆరాచకాలు, అధికారుల అండదండలు బయటకు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చిలకలూరిపేట రోడ్డు ప్రమాద కేసు ప్రస్తుతం ఒక సాధారణ ప్రమాదం కేసుగా కాకుండా దర్యాప్తు అధికారులు చూడలేదు.
ALSO READ: మూడో అంతస్తు నుంచి బిడ్డని విసిరేసిన కన్నతల్లి.. హైదరాబాద్లో మరో దారుణం
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను లోతుగా విచారించేందుకు చిలకలూరిపేట కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై విచారణ ఇవాళ జరగనుంది. నిందితులను కస్టడీకి అప్పగిస్తేనే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిందితుల అక్రమాలపై మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కోర్టు ఇచ్చే తీర్పు కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.