Konda Surekha: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తాజాగా బహిరంగంగా బయటపడింది.
మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన సమయంలో, అదే సమయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 41వ డివిజన్లో కొండా వర్గానికి చెందిన అనుచరులతో భేటీ కావడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న నివాసంలో జరిగిన ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ కొండా వర్గానికి చెందిన నేతలతో సారయ్య తేనీటి విందులో పాల్గొన్నారు.
మంత్రి కొండా ఇలాకాలోనే అనుచరగణాన్ని తనవైపు తిప్పుకుంటూ.. ఛాలెంజ్ విసిరారు బస్వరాజు సారయ్య. ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ సారయ్య పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో ఎమ్మెల్సీ సారయ్య భేటీపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. పది మంది గ్రూప్ను వెనకేసుకొని సంతోషపడుతున్నారు. వాళ్ల ఆనందాన్ని మేము అడ్డుకోము అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు బలహీనులు బలవంతుల వెనక పడతారు. కొండా దంపతులు బలవంతులు అంటూ తన రాజకీయ బలాన్ని మరోసారి చాటే ప్రయత్నం చేశారు మంత్రి సురేఖ. మమ్మల్ని ఢీకొనే ధైర్యం లేక, మా వెనక గోతులు తవ్వుతున్నారు. ఎవరు తీసిన గొయ్యిలో వాళ్లే పడతారు అని వ్యాఖ్యానించారు.
ఎవరిపై నేను అధిష్టానానికి ఫిర్యాదు చేసేది లేదు. చిల్లర వాళ్ల కోసం నేను కామెంట్ చేయను అంటూ పరోక్షంగా సారయ్య స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం గమనిస్తోందని, భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకుంటుందని కొండా సురేఖ చెప్పారు.
Also Read: తెలంగాణ వాసులకు కేంద్రం గుడ్న్యూస్.. రాష్ట్రంలో మరో ESIC ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
ఈ పరిణామాలతో వరంగల్ తూర్పు కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య చిచ్చు మరింత రాజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ, మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య ఇద్దరి మధ్య ఈ పోరు పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే విభేదాలు ఉన్నాయన్న విమర్శలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోంది.