Sangareddy Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట్ మండలం పరిధిలోని బీదర్–161 బి జాతీయ రహదారిపై.. నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడటంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ వైపు నుంచి బీదర్ దిశగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద సరైన హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ లేకపోవడం, అలాగే రోడ్డుపై గ్రావెల్ ఉండటంతో బైకు స్కిడ్ అయినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. వేగంగా వచ్చిన బైకు అదుపు తప్పి నేరుగా కల్వర్టు గుంతలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో మృతి చెందివ వారి వివరాలు చూస్తే.. ఆవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23) అనే ముగ్గురు యువకులుగా గుర్తించారు పోలీసులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జాతీయ రహదారిపై జరుగుతున్న నిర్మాణ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కల్వర్టుల వద్ద సరైన సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక లైట్లు ఏర్పాటు చేయకపోవడమే ప్రమాదానికి కారణమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు పలుమార్లు జరిగాయని, అధికారుల నిర్లక్ష్యంతోనే అమాయకుల ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: రూ.20 కోసం గొడవ.. భార్యను చంపి భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త
ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బైకు వేగం, రహదారి పరిస్థితులు, నిర్మాణ పనుల నిర్వహణలో జరిగిన లోపాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.