ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై మితిమీరిన వేగం మరోసారి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో జరిగిన ఈ భీకర ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి సర్వీస్ రోడ్డుపైకి ఎగిరిపడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శన ముగించుకుని ఆరుగురు ప్రయాణికులు కారులో బాచుపల్లి వైపు వెళ్తున్నారు. పోచారం గ్రామ సమీపంలోకి రాగానే, కారు అత్యంత వేగంగా ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి, గాల్లోకి ఎగురుతూ ఓఆర్ఆర్ పైనుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడింది.
నుజ్జునుజ్జైన కారు.. చెల్లాచెదురుగా మృతదేహాలు
ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అతివేగమే ప్రాణాంతకం..
ప్రమాద సమయంలో కారు వేగం పరిమితికి మించి ఉండటమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. సెలవు రోజున విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
ALSO READ: Garuda Purana: చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది – అసలు గరుడ పురాణం ఎం చెప్తుంది