Crime News: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో (Instagram) వీడియోలు చేస్తున్నాడనే నెపంతో, ఒక యువకుడిపై, అతని కుటుంబంపై స్థానిక సర్పంచ్ రవి అమానుషంగా దాడికి పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా ఉండి రక్షణగా నిలవాల్సిన వారే, ఇలా దౌర్జన్యానికి దిగడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
ఈ గొడవకు ప్రధాన కారణం జనార్దన్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడమేనని తెలుస్తోంది. సర్పంచ్ రవి, అతని కుటుంబ సభ్యులు కలిసి మొదట జనార్దన్ను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ దాడి అంతటితో ఆగకుండా, అడ్డుకోవడానికి వచ్చిన జనార్దన్ సోదరుడు శ్రీకాంత్, తల్లి, పెద్దమ్మ , ఇతర కుటుంబ సభ్యులపై కూడా సర్పంచ్ వర్గం విరుచుకుపడింది.
ఈ దాడి అత్యంత క్రూరంగా సాగింది. సర్పంచ్ కుటుంబం బాధితులపై కారం పొడి చల్లి, కళ్లు కనిపించకుండా చేసి విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీకాంత్, అతని సోదరితో పాటు ఇతర మహిళా బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Also Read: మోహన్ బాబు యూనివర్సిటీ ఇష్యూ.. ఇంతకీ సూసైడా.. మర్డరా..?
బాధితులు, గ్రామస్తులు కలిసి ఈ అన్యాయంపై పోలీస్ కమిషనర్ (CP) సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఒకే కుటుంబానికి చెందిన వారిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన సర్పంచ్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.