Jagtial suicide: అప్పుల బాధ, వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కంటే కూడా.. పదిమందిలో జరిగిన అవమానం భరించలేక ఓ మహిళ తనువు చాలించిన హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కనగాలా అనూష (40) కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తెలంగాణకు వలస వచ్చింది. ప్రస్తుతం వీరు జగిత్యాల పట్టణంలోని నూకపెల్లి అర్బన్ కాలనీలో నివసిస్తున్నారు. అనూషకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వడంతో.. కుటుంబ అవసరాల నిమిత్తం విజయవాడలోని కంకిపాడు ప్రాంతానికి చెందిన కొందరి వద్ద ఆమె కొంత మొత్తంలో అప్పు తీసుకున్నారు.
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలో జాప్యం జరగడంతో.. మంగళవారం ఉదయం కంకిపాడుకు చెందిన సదరు వ్యక్తులు జగిత్యాలలోని అనూష ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్దే ఆమెను నిలదీస్తూ దౌర్జన్యానికి దిగారు. స్థానికుల సాక్షిగా ఆమెను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. తీవ్రంగా అవమానించారు. పదిమందిలో జరిగిన ఈ అవమానాన్ని అనూష తట్టుకోలేకపోయారు. అప్పు తీర్చలేకపోవడం ఒక ఎత్తయితే.. ఇంటి మీదకు వచ్చి బూతులు తిట్టడం ఆమెను మానసికంగా కుంగదీసింది.
మనుషుల మధ్య తలెత్తిన ఈ గొడవతో తీవ్ర మనస్థాపానికి గురైన అనూష.. ఆ క్షణికావేశంలో బలవన్మరణానికి పూనుకున్నారు. వెంటనే ధరూర్లోని ఎస్సారెస్పీ (SRSP) కాలువ వద్దకు వెళ్లి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాధితురాలిని వేధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! 32 టీమ్స్.. ఒక్కటే వేట!