Fake Cement: కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్లుంది కేటుగాళ్లు తీరు. ఇన్నాళ్లు పాలు, టీ పొడి, నెయ్యి వంటి వాటిని కల్తీ చూసుంటారు. ఇప్పుడు ఏకంగా సిమెంట్ నే కల్తీ చేస్తున్నారు. ఏపీలో ప్రముఖ బ్రాండ్ల పేరుతో కల్తీ సిమెంట్ విక్రయాలను విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. 2018లో మహేష్ రావు, మహేశ్వరిబాయ్.. కస్తూరి సిమెంట్స్ పేరుతో కంపెనీకి లైసెన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత లేపాక్షి సిమెంట్స్ పేరుతో బ్రాండింగ్ గా మార్చారు. అయితే అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, రాశి సిమెంట్స్ పేరుతో వీళ్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో నకిలీ సిమెంట్స్ విక్రయాలు చేస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి, గుత్తివారిపల్లి గ్రామాల మధ్య బూడిద కలిపిన సిమెంట్ ను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సిమెంట్ కల్తీకి పాల్పడిన కస్తూరి సిమెంట్ లో విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ శాఖ జిల్లా అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల కస్తూరి సిమెంట్పై ఆకస్మిక దాడులు జరిగాయి. కస్తూరి సిమెంట్స్ కు పీపీసీ విక్రయాలకు మాత్రమే జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది. పోర్టులాండ్ పొజోలానా సిమెంట్ లో మోతాదుకు మించి ఫ్లైయాష్ ను కలిపి దానిని నకిలీ అల్ట్రాటెక్ కంపెనీ సంచుల్లో నింపి కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నారు.
సిమెంట్ ను కల్తీ చేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న ఓ లారీ అధికారులు సీజ్ చేశారు. కస్తూరి సిమెంట్ ఓనర్ మహేష్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ శాఖ, కమర్షియల్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కస్తూరి కంపెనీపై కేసులు నమోదు చేశారు. నకిలీ సిమెంట్ విక్రయాలతో ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను ఎగవేతకు పాల్పడ్డారు.
Also Read: Pawan Kalyan: ఎవరినీ వదిలిపెట్టం.. బిగ్ టీవీ కథనాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
విజిలెన్స్ తనిఖీల్లో 10% సిమెంట్, 80 నుంచి 90% బూడిద కలిసి సిమెంట్ ను తయారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక్క ఏడాదిలోనే 43 కోట్ల రూపాయల సిమెంట్ అమ్మకాలు జరిపినట్లు తేలింది. జీఎస్టీ ఉల్లంఘనలు, నకిలీ బ్రాండింగ్, పొల్యూషన్ బోర్డు ఈ కంపెనీపై కేసులు నమోదు చేశాయి.