Rani Kumudini: రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే.. అదే రోజున ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియను చేపడతారు. అంతేకాకుండా, సర్పంచ్ ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే, ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే నిర్వహించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. దీంతో.. తొలి విడత పోలింగ్ జరిగిన గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్లను ఒకే రోజున ఎన్నుకునే ప్రక్రియ పూర్తి కానుంది.
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,834 గ్రామాల్లో, 27,628 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలను విజయవంతం చేయడానికి సిబ్బందిని, భద్రతా బలగాలను సిద్ధం చేసినట్లు రాణి కుముదిని తెలిపారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు పోలీసులు రూ. 8.2 కోట్లను సీజ్ చేశారని ఆమె వెల్లడించారు. అక్రమ రవాణా, డబ్బు పంపిణీ వంటి వాటిని అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆమె వివరించారు.
మరోవైపు, ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఏకగ్రీవాల వివరాలను కూడా తెలియజేశారు. తొలి విడతలో భాగంగా 395 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అదే విధంగా, రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఈ ఏకగ్రీవాల వలన ఆయా గ్రామాల్లో పోలింగ్ అవసరం లేకుండానే నాయకులు ఎన్నికైనట్లు అయ్యింది. మిగిలిన గ్రామాల్లో మాత్రం రేపు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుందని, ఓటర్లు, అభ్యర్థులు నిబంధనలను పాటించి సహకరించాలని కోరారు.
ALSO READ: TG Global Summit: అక్షరాల రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్