Shamshabad Outer Ring Road accident: హైదరాబాద్ నగరం శివార్లలోని శంషాబాద్ వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై శుక్రవారం విషాదకరమైన ప్రమాదం సంభవించింది. శంషాబాద్ ఎగ్జిట్-16 సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు బలంగా ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ కుటుంబం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని.. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ (SR Nagar) వైపు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చౌటుప్పల్ నుంచి బియ్యం నూకల లోడ్తో నంద్యాలకు వెళ్తున్న లారీ, ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్-16 సమీపంలో సాంకేతిక లోపం (బ్రేక్ డౌన్) తలెత్తడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు, అదుపుతప్పి ఆగివున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు లారీ కిందకు దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. లారీ వెనుక భాగంలోకి కారు సగం వరకు దూసుకుపోయింది. దీనివల్ల మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ కట్టర్ల సాయంతో కారును కట్ చేసి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడగా.. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. కారు మితిమీరిన వేగంతో ఉండటం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి.. 62 ఏళ్ల జైలు శిక్ష!