Rangareddy district: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోపులారంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సెగ ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు ఓటు వేయలేదన్న నెపంతో ఓ మాజీ సర్పంచ్ అభ్యర్థి మందలించడంతో, మనస్తాపానికి గురైన కావలి అనిల్కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామానికి చెందిన సాయికుమార్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో.. అనిల్ కుమార్ కుటుంబం తనకు ఓటు వేయలేదన్న కోపంతో సాయికుమార్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ను నేరుగా నిలదీసి, తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. సాయికుమార్ ఒత్తిడిని తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు.
కుమారుడు వేలాడుతుండటం గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అనిల్ను శంకర్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తమ తమ్ముడి మరణానికి సాయికుమారే కారణమని అనిల్ అక్క ఆరోపిస్తున్నారు. “తమ కుటుంబం ఓటు వేయలేదని సాయికుమార్ కక్ష పెంచుకున్నాడు. అనిల్ను చంపేస్తానని అందరి ముందూ బెదిరించాడు. ఆ మాటలు విన్న అనిల్, వారు తనను ఎలాగైనా చంపేస్తారనే భయంతో, ప్రాణహాని ఉందని భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ కక్షల వల్లే ఈ ఆత్మహత్య జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? అనే దిశగా విచారణ జరుపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఈ ఘటన గోపులారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ALSO READ: Director Arrest: మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్..