Crime Training: మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో దొంగతనాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఫీజు చెల్లించి మరీ ట్రైనింగ్ లో జాయిన్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కోర్సు పూర్తైతే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్ మెంట్స్ ఇవ్వడంతో పాటు తల్లిదండ్రులకు రూ. లక్షల్లో ప్యాకేజీని సైతం అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్గఢ్ జిల్లాలో ఈ వింత పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మూడు గ్రామాలు ఈ నేరపూరిత శిక్షణకు కేంద్రాలుగా ఉన్నాయి. కడియా (Kadia), గుల్ఖేడీ (Gulkhedi), హుల్ఖేడీ (Hulkhedi)గ్రామాల్లోని నేరగాళ్ల ముఠాలు పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రుల నుండి రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయట.
సాధారణంగా 12 నుండి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలను ఈ శిక్షణలో చేర్చుకుంటున్నట్లు సమాచారం. మైనర్లు కాబట్టి ఒకవేళ పట్టుబడినా కఠిన శిక్షల నుండి తప్పించుకోవచ్చనేది ట్రైనింగ్ నిర్వాహకుల ఎత్తుగడ ఉంటోందని సమాచారం. జేబు దొంగతనాలు చేయడం, రద్దీగా ఉండే చోట బ్యాగులు లాక్కోవడం, పోలీసుల నుండి తప్పించుకోవడం, ఒకవేళ పట్టుబడితే దెబ్బలను తట్టుకోవడం వంటి వాటిలో వీరికి ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తున్నారట.
శిక్షణ పూర్తయ్యాక గ్యాంగ్ లీడర్లు ఆ మైనర్లను తల్లిదండ్రుల నుంచి అద్దెకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆ పిల్లల కుటుంబాలకు ఏడాదికి రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ప్యాకేజీ చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ శిక్షణ పొందిన పిల్లలు.. దేశవ్యాప్తంగా ధనవంతుల ఇళ్లలో జరిగే విలాసవంతమైన వివాహ వేడుకలను టార్గెట్ చేస్తున్నారట. సూట్లు వేసుకుని అతిథుల్లా కలిసిపోయి నగలు, డబ్బు ఉన్న బ్యాగులను మాయం చేయడంలో వీరు ఆరితేరిపోయారని పోలీసులు అంటున్నారు.
Also Read: BLDC Fans: తక్కువ బడ్జెట్లో.. అత్యాధునిక బ్రాండెడ్ ఫ్యాన్లు.. ఇంట్లో తుఫాన్లు సృష్టించొచ్చు!
కడియా, గుల్ఖేడీ, హుల్ఖేడీ గ్రామాల్లో సుమారు 2,000 మందికి పైగా నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని వారిపై వేలల్లో కేసులు ఉన్నాయని రాజ్గఢ్ జిల్లా పోలీసులు చెబుతున్నారు. అయితే వారిని అరెస్టు చేసేందుకు గ్రామాలకు వెళ్తే.. మహిళలు, స్థానికులు తమపై తిరగబడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల జైపూర్లో ఒక హైదరాబాద్ వ్యాపారవేత్త వివాహంలో జరిగిన కోటిన్నర విలువైన వజ్రాల దొంగతనం వెనుక కూడా ఈ గ్రామాలకు చెందిన వారే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనా కన్నతల్లిదండ్రులే తమ పిల్లలను నేరాలవైపు ప్రోత్సహించడం ఏమాత్రం మంచిది కాదని పోలీసులు చెబుతున్నారు. పట్టుబడితే జీవితాంతం జైల్లో మగ్గాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: Air Coolers: డెజర్ట్ vs పర్సనల్ vs టవర్.. మధ్యతరగతి ప్రజలు.. ఏ కూలర్ కొంటే బెటర్?