Inter Student Incident: అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ సెంకండ్ ఇయర్ చదువుతున్న.. తన్మయి అనే విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. ఆమెను పెట్రోల్ పోసీ కాల్చివేశారు దుండగులు. మణిపాల్ స్కూల్ వెనుక కాలిన తన్మయ్ మృతుదేహం లభ్యమైంది. మంగళవారం రోజు తన్మయి కనపడడం లేదని వన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.
పోలీసులు సకాలంలో స్పందించలేదని.. అమ్మాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం వేరే ఎవరికీ.. జరగకూడదని తన్మయి తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ అమ్మాయిని చంపిన వారికి ఉరిశిక్ష వేయాలని వారు కోరుతున్నారు.
కాగా.. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో.. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తన్మయి కాల్ హిస్టరీ, ఇన్స్టా డేటాలతో పాటు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గత మంగళవారం రాత్రి ఓ యువకుడితో కలిసి తన్మయి బైక్పై వెళ్లినట్లు గుర్తించిన తల్లిదండ్రులు.. బస్టాండ్, రైల్వేస్టేషన్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి 9 గంటలకు స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో మౌఖికంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం మళ్లీ పోలీస్స్టేషన్కు వెళ్లిన తన్మయి తల్లిదండ్రులు.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ యువకుడిపై అనుమానం ఉందంటూ.. అతని ఫోన్ నెంబర్ను పోలీసులకు ఇచ్చారు. FIR నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
నిన్న తన్మయి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. అది ఉన్న స్థితిని బట్టి.. కనిపించకుండా పోయిన రోజే ఆమెను చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇంటర్ విద్యార్థి తన్మయి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినట్లు తెలుస్తోంది. తన్మయి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.
తన్మయి హత్య కేసులో నరేష్, బాల అనే యువకులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నరేష్ అనే యువకుడికి అంతకుముందే పెళ్లి అయినట్లు పోలీసులు తెలిపారు.
బాల అనే యువకుడిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇవాళ, రేపట్లో తన్మయి హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ప్రాణం తీసిన ఈత సరదా.. ముగ్గురు చిన్నారులు మృతి
మరోవైపు, తన్మయి హత్యపై మంత్రి లోకేశ్ స్పందించారు. ఆమెను హత్య చేసిన తీరు కలచివేసిందన్న ఆయన… నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో సైకోలకు, ఉన్మాదులకు తావు లేదన్నారు. తన్మయి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.