Eluru Crime News: ఆ శిశువు ఎందుకు లోకంలోకి వచ్చిందో తెలియదు. వచ్చిన మరుక్షణం ప్రాణాలు వదిలింది. ఏ తల్లికి భారమైందో కానీ, ఆ శిశువును ఏకంగా నాలుగో అంతస్థులో నుండి పడవేసినట్లు తెలుస్తోంది. అమ్మ కాని అమ్మ వయస్సులో అమ్మగా మారి, సమాజం ఏమంటుందోనన్న భయంతో ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందా అనే ప్రశ్నలు అక్కడంతా వ్యాపించాయి. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో జరగగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
ఏలూరు లోని అశోక్ నగర్ వద్ద అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆ శిశువు మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ నిర్వహించి, మృతదేహాన్ని అక్కడి నుండి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఈ శిశువు మృతి వెనుక పెద్ద మిస్టరీ ఉన్నట్లు ఏలూరులో ప్రచారం సాగుతోంది.
అసలు కథ ఇదేనా?
ఏలూరులో శిశువు మృతి వెనుక ఉన్న కథ ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. ఓ హాస్టల్ లో ఉండే అమ్మాయి, గర్భాన్ని దాల్చింది. చదువు కోసం వచ్చిన అమ్మాయి గర్భాన్ని దాల్చడంతో అక్కడి సిబ్బంది ఖంగు తిన్నారట. ఆ అమ్మాయిని రహస్యంగా ఉంచి, విషయం బయటకు పొక్కకుండా అదే హాస్టల్ లో ఉంచారు. ప్రసవ సమయం రాగానే, వారే ప్రసవాన్ని పూర్తి చేసి, ఆ శిశువును బయటకు విసిరేసినట్లు ప్రచారం సాగుతోంది. 4 అంతస్థుల మేడ నుండి అప్పుడే పుట్టిన బిడ్డను విసిరివేశారని, అందుకే ఆ బిడ్డ చనిపోయినట్లు వదంతులు వ్యాపించాయి. తానేమీ నేరం చేయకపోయినా ఆ పసిపాప అప్పుడే పుట్టి, మరుక్షణంలో లోకానికి దూరమైంది. తప్పు తనది కాకున్నా, శిక్ష మాత్రం ఆ బిడ్డ అనుభవించిందని స్థానికులు చర్చించుకోవడం విశేషం.
Also Read: Manchu Manoj Injured: తండ్రీ కొడుకుల గొడవల్లో మంచు మనోజ్కు గాయాలు.. హాస్పిటల్లో చికిత్స
పోలీసులు మాత్రం ఈ విషయాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఏలూరులో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనా, ఇంతకు ఆ శిశువు ఎవరు, కారకులు ఎవరనే విషయాలు పోలీసుల దర్యాప్తులో బహిర్గతం కావాల్సి ఉంది. ఏదిఏమైనా ఈ ఘాతుకానికి కారణమైన వారిని చట్టరీత్యా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.