Sanath Nagar Murder: హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ వ్యక్తి, గుర్తుతెలియని దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంకర్ (48) ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చాడు. ఇక్కడ మూసాపేటలోని ఒక హోటల్లో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. భరత్ నగర్ బ్రిడ్జి సమీపంలో శంకర్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శంకర్ శరీరంపై లోతైన కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్య వెనుక అక్రమ సంబంధం కోణం బలంగా కనిపిస్తోంది. శంకర్ వ్యక్తిగత జీవితం, అతను ఎవరితోనైనా గొడవలు పడ్డాడా లేదా ఎవరితోనైనా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడా అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. పాత కక్షలు లేదా క్షణికావేశంలో జరిగిన దాడి కాదని.. పథకం ప్రకారమే దుండగులు అతడిని అంతం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. శంకర్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: యముడిలా దూసుకొచ్చిన ఇన్నోవా.. బైక్ను ఎలా ఢీకొట్టిందంటే.. వీడియో వైరల్!