Anantapur: అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU)లో విషాదం నెలకొంది. యూనివర్సిటీలో ఎంఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మాధుర్య (21) హాస్టల్ గదిలోనే మృతి చెందడం తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన మాధుర్య ఎస్కే యూనివర్సిటీలో పీజీ చేస్తూ వసతి గృహంలో ఉంటున్నారు. ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థినులు వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఆమెను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికీ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మాధుర్య గత కొంతకాలంగా తీవ్రమైన చర్మ వ్యాధి (Skin Disease) తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు. అయితే.. ప్రాథమిక విచారణలో భాగంగా వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. ఆమె వాడుతున్న మందులు ఓవర్ డోస్ కావడం వల్లే శరీరంలో ప్రతిచర్యలు జరిగి ఫిట్స్ వచ్చి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు. మందుల మోతాదు పెరగడం వల్ల తలెత్తిన దుష్ప్రభావాలే మరణానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. మాధుర్య గదిలో ఉన్న మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లను, వాడుతున్న మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే మాధుర్య ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆమె కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
ALSO READ: Nizamabad district: జ్యువెలరీ షాప్ షటర్లు పగలగొట్టి 34 తులాల గోల్డ్ చోరీ.. నిజామాబాద్లో ఘటన